నాయనా ! దుర్యోధనా ! నీకూ, నీ వారికీ సర్వప్రపంచానికీ మేలుకలిగే విషయం చెపు తున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను.
చాలారోజుల క్రితంమాట. దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు. ఆయనా ఈ భూమండలం అంతానూ పాలించేవాడు. భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటివచ్చేవారు లేరు ఆ రోజుల్లో, అంతటి మహాయోధుడాయన.
ఆయనరోజూ ఉదయంలేచి, కాలకృత్యాలు పూర్తికాగానే బాగా అలంకరించుకొని రత్నకిరీటం ధరించి, కోడెత్రాచువంటి కరవాలంచేత బట్టి సభాభవనానికి వచ్చి బంగారుసింహాసనం అధివసించేవాడు. వంది మాగధులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తూంటే, కోరమీసం మెలితిప్పుతూ ఆనందించేవాడు.
అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ: “ఈ భూలోకంలో ఎవడయినా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా! గదా, ఖడ్గ ప్రాసాది ఆయుధాలతోకాని, ఆగ్నేయ, వారుణ, వాయువ్యాది అస్త్రాలతోకాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు మల్లయుద్ధం చేయగలవీరుడు ఉన్నా వాడిని క్షణంలో కడతేరుస్తాను.” అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు.
ఆయన బలపరాక్రమాలెరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు అంతతో ఆయన అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది నా అంతవాడు లేడనే గర్వంతో ఆయిన విర్రవీగుతూ తిరుగుతున్నాడు. అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులుకూడా అటువంటి అవివేకులే దొరుకుతారుకదా! వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు.
అలాఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు - “మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలపరాక్రమ సంపన్నులే. అయితే గంధమాదనపర్వతంమీద నరనారాయణులని ఇద్దరు తీవ్రనిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడులోకాలలో లేరని విన్నాము. తమకు కోరికఉంటే వారితో యుద్ధం చేయవచ్చు” అన్నారు.
ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి ఝళిపించి నేలమీద పాదంతో తొక్కి! ఎంతటికావరం! నన్నుమించిన యోధులావారు, అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు. గంధమాదన పర్వతం చేరాడు.
ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం మెలిత్రిప్పాడు. నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరుపబోగా, ఇవన్నీ అనవసరం, యుద్ధం, యుద్ధం అని అట్టహాసం చేశాడు. అప్పుడు వారు: “ఎవరితోనూ సంబంధంలేకుండా కళ్ళుమూసుకుని యీ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు?” అన్నారు. వినలేదు మహారాజు. యుద్ధం చెయ్యకతప్పదు, అన్నాడు. అంటూనే బాణం తొడుగుతూంటే చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్లతీసి : “ఇదిగో ఈ గడ్డిపరక నీ సేనను నిలబెడుతుంది” అని వదిలాడు.
ఆ రాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్నిబాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది. ఈలోగా సేసలోని వారందరూ ముక్కులూ, చెవులూ ఊడిపోయి రోదనం ఆరంభించారు. రాజుకి తల తిరిగింది. సేవలు పలాయనం చేస్తున్నాయి చూసిన రాజు గుండె జారింది. ఆయుధాలన్నీ క్రింద పెట్టి, తలవంచి నరనారాయణుల పాదాలమీద వ్రాలి: “ఆర్యా ! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయ్యింది” అని దీనంగా ప్రార్థించాడు.
అప్పుడు వారు సవ్వుతూ “మహారాజా! సిరిసంపదలు కలవారు పేద సాదలకు దానధర్మాలు చేసి గొప్ప వారు కావాలి. అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారినుండి ప్రజలను రక్షించడానికి తమశక్తిని వినియోగించాలి. అంతేకాని, అహంకారంతో తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మవ్యర్థం అన్నారు.
మహారాజు వారి బోధవిని, ఆనాటినుంచీ అహంకారం విడిచి, అందరి శ్రేయస్సూ దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ; తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జన సేవచేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు. కనుక, “దుర్యోధనా! అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి” అన్నాడు పరశురాముడు.