కలియుగంలో ఇలాంటి దారుణాలు జరుగుతాయని అప్పుడే చెప్పారా???

Thumb Image

అయిదువేల సంవత్సరాల క్రితమే వ్యాసమునీంద్రుడు ఆధునిక కాలాన్ని ఎలా ఊహించాడో చదివితే ఆయన దూరదృష్టి వివేకవంతులకు ఆశ్చర్యం కలిగిస్తుంది, కనుక సావధానంగా చిత్తగించండి.

అరణ్యవాసం సాగిస్తున్న రోజులలో పాండురాజు కుమారులైన పాండవులకు మార్కండేయ మహామునీంద్రుని దర్శనభాగ్యం లభించింది.

ఆ చిరంజీవి వారికి ఎన్నెన్నో విశేషాలు, కథలు చెబుతూ తాను ఒకానొకప్పుడు చూసిన కలియుగం ఎలా ఉన్నదో వివరిస్తున్నాడు.

"ధర్మనందనా ! కృతయుగంలో రాజు ఉండడు. సేనలు ఉండవు. ఎందుకంటే ఆ యుగంలో అందరూ ధర్మపరాయణులు, సత్యవాక్పాలకులు, అహింసావ్రత దీక్షితులు. అటువంటి సమయంలో సేనలూ, రాజులూ అవసరం లేదు.

త్రేతాయుగంలో సత్య, ధర్మాలకు కొంత హాని జరుగుతుంది. ధర్మం మూడు పాదాలే ఉంటుంది. అందువల్ల రాజు, సేన ఏర్పడుతాయి. ద్వాపర యుగంలో సగం మంది అధర్మ పరాయణులే. ఈ యుగాంత వేళకే కలియుగ లక్షణాలు కూడా ప్రవేశిస్తాయి. అయినా ద్వాపరయుగంలో ధర్మానికే విజయం. సత్యవ్రత పరిపాలకులే ప్రభువులు అవుతారు. ఇక కలియుగం గురించి వినండి.

ఈ కలికాలంలో ఎవడు బాగా మోసం చెయ్యగలడో వాడు సింహాసనం ఎక్కి అధికారం చెలాయిస్తాడు. అటువంటి వారు అధికారులయినప్పుడు వివేకవంతులకూ, జ్ఞానులకూ స్థానం ఉండదు. అందువల్ల అవివేకులూ, జ్ఞానశూన్యులూ ఉపదేశాలిస్తూ ధన సంపాదన ఆరంభిస్తారు.

వేదాధ్యయనమూ, క్రతువులూ సాగించి పరబ్రహ్మను ఆరాధించుకోవలసిన విప్రవరులు ఆ రెండూ విడిచి అన్ని రకాల పానీయాలూ సేవిస్తూ, రకరకాల ఆహారాల కోసం ఎగబడతారు. లోకానికి సన్మార్గం చూపవలసిన వీరే యిటువంటి దురాచారాలకూ, దుర్వ్యసనాలకూ లొంగితే వీరిని అనుసరించవలసిన వారు ఏమవుతారో వేరే చెప్పాలా!

అసత్యవాదులూ, అల్పాయుర్దాయం కలవారూ పుడుతుంటారు, అంతేకాదు, ఇప్పటివలె ఆజానుబాహులూ, తాళప్రమాణదేహులూ పుట్టరు. మరుగుజ్జులు ఎక్కువవుతారు. నేల ఉసిరిచెట్టుకి నిచ్చెన వేసి ఎక్కవలసిన అంగుష్ఠమాత్ర శరీరాలవారు పెరుగుతారు. వీరికి కామవాంఛ ఎక్కువ. అందుకోసం మద్యపానం విరివిగా సాగిస్తారు. మరో విచిత్రం: ఆహార పదార్థాలలో రుచిఉఁడదు. అన్నీ ఎండుగడ్డిలా ఉంటాయి. అసలు వీరి నాలుకకు రుచి తెలియదు, దొరికిన పదార్థం తినడమే. అంతకన్న ఆశ్చర్యం ఏమిటంటే సుగంధ ద్రవ్యాలకు సువాసన ఉండదు.

ఆ యుగంలో మనుషులకు పదహారేళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడి పోతుంది. ఏడెనిమిది సంవత్సరాల వయసుకే కన్యలు గర్భవతులవుతారు ! మానవుడి పూర్ణాయుర్దాయం ఎంత ఉంటుందో తెలుసా? పదహారేళ్ళు : అంతే ! అప్పటికే అన్నీ తీరిపోతాయి.

మత్స్యమాంసాలు తిననివారు కనిపించరు. దానితో మద్యపానం విలాసంగా తయారవుతుంది. జూదరులు వాడవాడలా పెరుగుతారు. ఇవన్నీ ఘనకార్యాలుగా భావిస్తారు. ఏ రోజు తెల్లవారి లేచినా హత్యలూ, దొమ్మీలూ, దోపిడీలు యివే కనిపిస్తాయి. వీటిని గురించే చెప్పుకుంటారు.

గోళ్ళూ, వెంట్రుకలూ వివరీతంగా పెంచుకుని రాజవీథులలో తిరిగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి రోజులలో నాస్తికులు కూడా ప్రబలుతారు అది ఒక వ్యాపారంగా బ్రతుకుతారు.

పోనీ మనుషులు ఎలా తయారయితే ఏం? అనుకుంటే వీరు తమ అవసరం కోసం వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆవుల పాలు పితకడం వల్ల అవి అనారోగ్యంతో మరణిస్తాయి. గోసంపద క్షీణిస్తుంది.

గోవుల పాలే కదటయ్యా! మానవులకు అమృతం. అది లేకుండా చేసుకుంటారు కలియుగ మానవులు. ఆ సమయంలో అధికారులందరూ జలగలు రక్తం పీల్చినట్లు ప్రజలను హింసించి పన్నులు పిండుతారే తప్ప వారి రక్షణ విషయం చూడనే చూడరు.

పాపిష్ఠి డబ్బు కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటారు. తండ్రిని కొడుకు మన్నించడు. భర్తను భార్య ఎదిరిస్తుంది. జనపనార వంటి వానితో తయారయిన వస్త్రాలు ధరించి తిరుగుతారు. కన్యాదానాలు, వివాహాలూ ఉండవు. వయసు వచ్చిన ఆడపిల్లలు తమకు వచ్చిన యిద్దరు ముగ్గురు యువకులతో హాయిగా విహారాలు సాగిస్తారు. అదే దాంపత్యం. శ్మశానాలలో దూరంగా ఉండవలసిన ఎముకలు తెచ్చి రకరకాల బొమ్మలు చేసి గృహాలలో అలంకరించి సంతోషిస్తారు.

ధర్మనందనా ! ఇప్పుడు విద్య నేర్చుకునే వాడికి అన్నం పెట్టి, నీడయిచ్చి, విద్య నేర్పే, ఆశ్రమాలు చూస్తున్నావు. అలానే ఆకలితో కడుపు చేతబట్టి గుమ్మంలో నిలిచి 'దేహి' అన్న పిలుపు వినబడితే ఆదరంతో అన్న దానం చేసే సంసారులు కనిపిస్తున్నారు. కలియుగంలో అన్నదానం, విద్యాదానం ఉండవు. అన్నాహారాలు అమ్ముకుంటారు. విద్యకూడా వ్యాపార వస్తువే అవుతుంది.

అన్నవిక్రయం, విద్యావిక్రయం ఆరంభించాక యింక ఏం జరుగుతుందో ఊహించలేవు. అలా కొంతకాలం కలియుగం గడిచాక అమావాస్య రాకుండానే సూర్యగ్రహణం, పూర్ణిమ ప్రవేశించకుండా చంద్రగ్రహణం ఏర్పడతాయి.

ప్రజలకు పచ్చని పొలాలూ, తోటలూ ఉండే నదీ తీరాలలోని పల్లెల మీద మనసు విరిగిపోయి పట్టణాలకు చేరుతారు. అందరికీ నగరావాస వ్యామోహమే! పల్లెలు నిర్జన ప్రాంతాలవుతాయి, పంటలు నశిస్తాయి.

యుగాంత సమయంలో ఝంఝామారుతం రేగుతుంది. అది నిర్విరామంగా సాగుతుంది. ఏడుగురు సూర్యులు ఉదయిస్తారు. భగభగలాడుతూ అగ్ని జ్వాలలు పుడతాయి. అలా గడిచాక అంతా బూడిద అవుతుంది.

అప్పుడు కుండపోతగా కొంత కాలం వాన కురుస్తూనే ఉంటుంది, అది యుగసంధి. నెమ్మదిగా ఈ బీభత్సాలు చల్లారుతాయి. రవి, గురు, చంద్రులు ఒకేసారి కర్కాటకంలో ప్రవేశిస్తారు.

కాలానికి అవసరంగా వానలు, ఎండలు ఉంటాయి. భూమి పచ్చ పచ్చని చెట్లతో, లతలతో, ఫలపుష్ప భరితం అవుతుంది. ప్రజలు జరా రోగపీడలు లేకుండా అన్నదాన, విద్యాదానాది కార్యాలతో సుఖంగా ఉంటారు. అది కృతయుగం” అన్నాడు మార్కండేయుడు.