పాండవులు జూదంలో ఓడిపోయి, అడవులకు వచ్చారు. వారితో పాటు ఎందరో వేదవిదులు కూడా అనుసరించి రాగా, వీరందరి పోషణ భారం ఎలా నిర్వహించగలనా అని ధర్మరాజు విచారంలో మునిగాడు.
అప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుడు:'ధర్మనందనా! రాజవంశీయుడు తనను ఆశ్రయించిన వారికి అన్నపానాలు సమకూర్చి వారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. మీ ప్రాచీనులు అందరూ ఈ ధర్మ నిర్వహణ సాగించారు. తపస్సుతో, యోగశక్తితో వారు తమ ప్రజలకు ఈ రక్షణననందించారు.
అంతకంటే ముఖ్యాంశం ఒకటి ఉంది: ఈ సృష్టి ప్రారంభం వేళ జీవకోటి అంతా ఆకలి బాధతో కటకట లాడుతుంటే అది చూసిన సూర్యభగవానుడు తాను ఉత్తరంగా పయనించి భూమిలోని సారాన్ని గ్రహించి, అనంతరం దక్షిణంగా తిరుగుతూ ఆ సారాన్ని మళ్ళీ భూమికి అందించేవాడు. అదే సమయంలో చంద్రుడు మేఘ రూపంలో ఉన్న సూర్యతేజస్సును వర్షంగా మార్చి, ఆ జలధారలతో ఓషధులను అందించేవాడు. ఆ ఓషధులలోని ఆరు రసాలూ షడ్రుచులుగా జీవకోటికి ఆహారం అయ్యాయి.
అంటే సర్వ జీవకోటికీ వెలుగునిచ్చే సూర్యుడే అన్నదాత. ఆయనను ప్రార్థించి నీ కోరిక నెరవేర్చుకో' అన్నాడు. పురోహితుల ఆదేశానుసారం ధర్మరాజు అరుణోదయానికి లేచి గంగా తీరానికి వెళ్లి, స్నానం చేసి పవిత్ర హృదయంతో సూర్యుని ఆరాధించాడు.
ఆ నిర్మల హృదయుని తపోదీక్షకు సంతోషించి సూర్యుడు ప్రసన్నుడై అతని కోరిక ప్రకారం ఒక తామ్ర పాత్ర యిచ్చి:'ధర్మనందనా ! ఇది అక్షయ పాత్ర. ఎందరి కయినా ఇది అన్న పానాలు సమకూరుస్తుంది. అయితే, నీ భార్య పాంచాలి భోజనం చేసి, ఈ పాత్రను పరిశుద్ధం చేసిన అనంతరం ఆ పూటకు మరి భోజనం రాదు. అంటే అతిథి పూజలు పూర్తి చేసే వరకూ, ఆవిడ భుజించదు కదా! అందు చేత నీ కోరిక తీరింది. ఇది తీసుకు వెళ్లు' అన్నాడు.
అపరిమితానందంతో ధర్మరాజు తిరిగి వచ్చి, ఆనాటి నుండి తనతో వచ్చిన వారికే కాక, అతిథి అభ్యాగతులకు కూడా అన్నదానం చేసి కీర్తి పొందుతున్నాడు. ఈ కబురు విన్నాడు దుర్యోధనుడు. ఆ సమయానికే అక్కడకు చేరిన దుర్వాసమహర్షిని ఆరాధించి పాండవులను ఏ విధంగా నయినా పరాభవించాలని కోరాడు. దుర్వాస మునీంద్రుడు అంగీకరించి బయలుదేరి వచ్చాడు.
విషయం తెలిసిన వాడు కనుక పాండవులూ, పాంచాలీ కూడా భోజనం చేశాక వారిని చేరి, కుశల ప్రశ్నలు ముగించి 'నా శిష్యులతో పాటు నాకు ఆతిథ్యం యివ్వాలి అన్నాడు. ధర్మరాజు సంతోషంతో ఆవార్త పాంచాలికి చెప్పాడు. వంట యిల్లు కడుగుతున్న ఆ ఇల్లాలి గుండె గతుక్కుమంది. నదీస్నానం చేసి రాగలం. ఈ లోపున పర్వం (భోజనం) సన్నద్ధం కావాలి' అని పలికి మునీంద్రుడు వెళ్ళాడు.
ద్రుపద రాజనందన రెండు చేతులూ జోడించి వాసుదేవుని ప్రార్థించింది. నిర్మల చిత్తంతో ఆమె ధ్యానించే సరికి దీనజన శరణ్యు డైన వాసుదేవుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై 'అమ్మాయీ ! ఈ నాటి శాక పాకాలలో ఏ లేశమైనా ఉంటే నా చేతీలో వెయ్యి' అన్నాడు.
'అక్షయ పాత్ర కూడా శుద్ధి చేశాను. కృష్ణా! ఎందుకీ పరీక్ష :' అంది.'కాదమ్మా ! నా మాట విని ఒక్క మారు ఆ పాత్రలోకి చూడు, అన్నాడు.
ఆయన మాట కాదనలేక, అక్షయ పాత్రలో చెయ్యి పెట్టింది. దాని అంచున ఒక అవిశ ఆకు దొరికింది. అది తీసి కృష్ణుని చేతిలో ఉంచగా ఆయన దానిని నోట ఉంచుకొని: 'ముల్లోకాలకూ తృప్తి కలుగుగాక!' అని వెళ్ళిపోయాడు. ద్రుపద రాజనందన అతిథుల కోసం ఎదురు చూస్తున్నది. ఎంత సేపయినా వారు రావడం లేదని భీముని పంపారు.
ఇక్కడ వాసుదేవుడు 'ముల్లోకాలకూ తృప్తి కలుగుగాక!' అన్న క్షణంలో దుర్వాసునికి, ఆయన శిష్యులకూ, కడుపు నిండుగా భుజించిన ఆయాసం కలిగి వారు అటే వెళ్ళిపోయారు.
నదీ తీరానికి వచ్చిన భీమునికి అక్కడి మునులు: 'నాయనా! దుర్వాసుల వారు శిష్య సమేతం స్నానం చేస్తూనే సుష్ఠుగా భుజించిన తృప్తితో త్రేన్చుకుంటూ వెళ్ళిపోయారు' అని చెప్పారు. భీముడు తిరిగి వచ్చి ఆ వార్త చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు.
‘ధర్మపరులను పరాభవించడానికి ప్రయత్నిస్తే ధర్మ రక్షకుడు వారినే పరాభవం పాలుచేస్తాడు, అని సూతుడు భారతకథను వినిపించాడు.