చదువొక్కటే జీవిత పరమార్థం కాదు - అలా మునిగిపోయిన పండితుని గురించి విన్నారా?

Thumb Image

పుట్టినప్పటినుంచి చచ్చే వరకు అనేక సాదక బాదకాల సంసారంలో మనిషి ఆడుతూ పాడుతూ గడిపేస్తు ఉంటాడు. జీవితంలో ఒక్కో సమయంలో ఒక్కో విద్య

మనకు పనికివస్తుంది. అలాగని ఏ విద్యా ఉన్నతమైనది కాదు, ఏ విద్యా అధమం ఐనదీ కాదు. ఏది ఏ సమయంలో ఎలా ఉపయోగపడుతుందో ఎవరికీ తెలీదు.

పూర్వమొకానొక పండితుడు సర్వవిద్యా పారంగతుడు పాద చారియై యాత్ర చేస్తూ పోతున్నాడు. దారిలో ఒకచోట నది ఒకటి అడ్డం వచ్చింది,దానిని దాటితేకానీ తన ప్రయాణం సరిగ్గా సాగదు. నదిలో నీరు చూస్తే వెల్లువలుగా ప్రవహిస్తున్నాయి. ఆ నదికి ఒడ్డున ఒక బెస్తవాడు చిన్నపడవ నొకదానిని ఉంచుకొని ఉండడం ఈ పండితుడు చూశాడు.

     ఆ పండితుడు అతనిని అడిగి ఆవతలి ఒడ్డుకు చేర్చమని కోరాడు. ఇరువురును తెప్పలోనికి ఎక్కి ప్రయాణాన్ని ప్రారంభించారు. బెస్తవాడు పడవను నడుపుతున్నాడు. పండితుడు నావలో కూర్చొని దీర్ఘాలోచనా తత్పరుడై ఉన్నాడు. ఏమి ఊహకు వచ్చిందో కాని అకస్మాత్తుగ ఆ పల్లెవానిని పిలిచి ‘ ఏమోయ్! తర్కవిద్య నీవేమైన నేర్చుకున్నావా? అని అడిగాడు. బెస్తవాడు పడవను నడుపుతూనే 'లేద'ని జవాబిచ్చాడు. అటుపిమ్మట వారిరువురి మధ్య ఈ క్రింది సంభాషణము నడిచింది.

పండితుడు:- ఛీ, ఛీ, తర్కవిద్య నేర్వని జీవితము జీవితమేనా? అట్టి అపూర్వ విద్యను నేర్చుకోనందువలన నీ జీవితములోని పాతిక భాగము వ్యర్థమైపోయినదని నేను తలంచుచున్నాను. ఇప్పుడైనను నాబోటివారి దగ్గర నేర్చుకొని బాగుపడు! అయితే సరేకాని మీమాంస ఏమైన చదివావా?

బెస్తవాడు:- బాబూ! మీమాంస సంగతి నాకు ఏమీ తెలియదు మా మాంసం సంగతి మాత్రము తెలుసును.

పండితుడు:- ఓరి వెర్రివాడా! మీమాంస నేర్చుకొనని వాడెవడైనా ఉండునా? అది నేర్వనందువలన నీ జీవితమములో ఇంకొక పాతిక భాగము వృథా అయినదని నేను భావించుచున్నాను. పోని జ్యోతిష్యము చదివినావా?

బెస్తవాడు:- బాబూ అది అంతకంటెను నాచేత కాదు.

పండితుడు:- నారాయణ! నారాయణ! జీవితములో ఇంకొక పాతికభాగము నాశనము చేసికొనినావురా వెర్రివాడా! తర్క, మీమాంస, జ్యోతిషములను మూడు శాస్త్రములను తెలియనివాడు ముప్పాతిక జీవితము దండుగ జేసికొనినట్లే అని గ్రహింపుము!

ఈ ప్రకారము వారిరువురి మధ్య సంభాషణము జరుగుచుండగా పడవ సరిగ్గా నదీమధ్య భాగానికి వచ్చింది. నీటి ప్రవాహము చాల వేగంగా ఉంది. ఇంతలో పెద్ద గాలి వీచింది. తుఫాను చెలరేగింది. నదిలో నీళ్ళు పెద్ద అలలు కొడుతూ భయాన్ని కలిగిస్తున్నాయి. పడవ అలల తాకిడికి గింగిరాలు కొట్టసాగింది. ఇంతలో పడవలోనికి నీరు రావడం మొదలైంది.

  పడవ నెమ్మదిగా మునుగడం ప్రారంభమైంది. ఆ ఘోర విపత్సమయంలో బెస్తవాడు పండితుని పిలిచి "అయ్యా బాబూ, తమకు ఈత విద్య వచ్చునా"? అని అడిగాడు "రాదని” జావాబిచ్చాడు పండితుడు. అది విని ఆ పల్లెవాడు "మహాప్రభూ! తర్క మీమాంస జ్యోతిషములు చదువనందున నా జీవితములో ముప్పాతిక భాగము మాత్రమే నాశనమైనది. 'ఈతవిద్య' రానందువలన తమ జీవిత మిపుడు మొత్తము మొత్తముగానే (100%) నాశనమై పోయింది.' అని పలికి ఊరుకున్నాడు.

ఇంతలో పడవ మునిగి పోయింది. పండితుడు జలసమాధి అయ్యాడు. బెస్తవాడు ఈదుకొని ఒడ్డుకు చేరాడు. 


   నీతి: జీవితంలో ఏ సమయానికి ఏ విద్య అవసరమో అది ఉపయోగపడుతుంది కానీ అన్ని విద్యలూ అన్ని చోట్లా పనికి రావు. ఏ విద్యా గొప్పది కాదు, మరేదీ తక్కువా కాదు.