మహాభారతంలోని - దుష్యంతుడు, శకుంతల ప్రేమకథ గురించి విన్నారా? పార్ట్-2

Thumb Image

రాజానికి వెళ్లి సపరివార సమేతంగా వచ్చి తన పట్టమహిషిగా తీసుకువెళతాను అని మాట ఇచ్చి వెళ్ళాడు దుష్యంతుడు. దుష్యంతుడు వెళ్ళిన కొద్ది సేపటికి కణ్వమహర్షి వచ్చాడు. సిగ్గుతో, భయంతో ఉన్న శకుంతల ఆయనకు యథాప్రకారం ఎదురుగా వెళ్ళి నమస్కరించి, చిరునవ్వుతో స్వాగతం పలకలేదు. కణ్వమహర్షి ఆమెనుచూసి 'అమ్మా। ఆశీర్వాదం! ఏం జరిగింది తల్లీ ? నిర్భయంగా చెప్పు ' అన్నాడు.


'పితృపూజ్య! దుష్యంత మహారాజు మన ఆశ్రమానికి వచ్చారు. ఆయనను నేమ భర్తగా స్వీకరించాను. అనంతర కథ మీరు గ్రహించ గలరు' అంది శకుంతల.

కణ్వమహర్షి ప్రసన్న వదనంతో ! 'అమ్మా ! చాలా సంతోషం. అనురాగ తరంగిత హృదయులయిన మీరు ఏర్పరచుకున్న సంబంధం క్షత్రియులకు తగినదే. దీనినే గాంధర్వం అంటారు. యోగ్యుడయిన భర్తను పొందావు. అందువల్ల నీవు ధర్మాత్ముడూ, మహా బలిష్ఠుడూ అయిన కుమారుని కని కీర్తి పొందుతావు. నీ పుత్రుడు సర్వశత్రు సంహారం చేసి భూ మండలాన్ని పరిపాలించగలడు, ' అని ఆశీర్వదించాడు.

రోజులు గడుస్తున్నాయి. నెలలు దాటుతున్నాయి. మహారాజు నుండి కబురు లేదు. శకుంతల మనసంతా దుష్యంతుని మీదనే ఉన్నది. ఆకలి వెయ్యడం లేదు. పరిశుభ్రంగా స్నానం చెయ్యాలని అనిపించడం లేదు. ఏ పూటకాపూట రాజధాని నుండి రథం వస్తుందని ఎదురు చూస్తున్నది.

ఈలోగా నెలలు నిండి ఒకానొక శుభ ముహూర్తంలో ఆమె ప్రసవించింది. కణ్వమహర్షి ఆ బాలుడికి జాతక కర్మ జరిపించాడు. బాలుడు పెరుగుతున్నాడు. వాని చేతులలో చక్రాలు చక్రవర్తి లక్షణాలని నలుగురూ అంటూంటే ఉప్పొంగేది శకుంతలలోని మాతృ హృదయం. ఆరేడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ బాలుడు సింహంవలె పరాక్రమించి, ఆశ్రమ పరిసరాలకు వచ్చే పెద్దపులులనూ, సింహాలనూ, మదగజాలనూ చెవులు పట్టి ఆడించేవాడు.

అది చూసి అక్కడి మునులు వానికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. పెరుగుతూ ఉన్న బాలునికి రాజవంశ సంప్రదాయానుసారం అన్ని విద్యలూ నేర్పుతున్నాడు కణ్వమహర్షి. పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి.

అప్పుడొకనాడు కణ్వమహర్షి : “అమ్మా! ఇంతవరకూ మహారాజు కబురు పంపలేదు. ఇప్పుడు నీ కొడుకు యువరాజు పదవి అలంకరించవలసిన వయసులో ఉన్నాడు. ఎంతటి పతివ్రతయినా చిరకాలం పుట్టింట ఉండకూడదు. భర్త దగ్గరే కష్టమయినా, సుఖమయినా అనుభవించడం భార్యకు ధర్మం,” అని ఆమె కుమారుని దగ్గరగా తీసుకుని. “నాయనా! చంద్రవంశీయుడయిన దుష్యంత మహారాజు నీ తండ్రి. నువ్వు మీ అమ్మతో అక్కడకు వెళ్ళి యువరాజు పదవిని ధర్మ దీక్షతో నిర్వహించాలి” అని తన శిష్యులను పిలిచి.

“నాయనలారా: వీరిద్దరినీ తీసుకువెళ్ళి దుష్యంత మహారాజు దగ్గర విడిచి రండి” అన్నాడు. ప్రయాణ సన్నద్ధురాలై శకుంతల ఆయన పాదాలకు అభివాదం చేసింది. బ్రహ్మచర్య దీక్షితుడూ, తపస్సంపన్నుడూ అయిన కణ్వమహామునికి కన్నీరాగలేదు. పెంచిన ప్రేమ నిండిన గుండెలో బాధ పుట్టింది. కంటనీరు ఒలికింది. గద్గద స్వరంతో : “లోకమంటే ఏమిటో ఎరగని ఈ అమాయకురాలిమీద దేవతలందరూ దయ చూపాలి”అని ఆశీర్వదించి పంపాడు.

శకుంతల తన కుమారుడైన భరతుని (సర్వదమనుని ముద్దుపేరు) వెంటపెట్టుకుని దుష్యంతుని దగ్గరకు బయలుదేరింది. అరణ్యం దాటి రాజధాని చేరి దుష్యంతుని కోటలో ఆయన కొలువులో శకుంతలనూ, భరతునీ విడిచి కణ్వుని శిష్యులు తరలి వెళ్ళారు.

దుష్యంత మహారాజు సభా భవనంలో సింహాసనం మీద ఉన్నాడు. మంత్రి, సామంత, దండనాథులతో విద్వాంసులు కూడా ఆ సభలో ఉచితాసనాల మీద అలరారు తున్నారు. అప్పుడు వచ్చిన శకుంతల, తన కుమారుడయిన భరతుని భుజం మీద చెయ్యి వేసి “నాయనా ! సత్య ధర్మ పరాయణుడైన ఈ మహారాజు మీ నాన్న గారు. ఆయనకు నమస్కరించు” అని తనుకూడా చేతులు జోడించింది. కుమారుడు భరతుడు సంతోషంతో ఆశగా తండ్రి వైపు చూశాడు.

   ఇక్కడికి కథలో మరొక ఘట్టం పూర్తవుతుంది. దుష్యంతుడు ఎందుకు శకుంతలను నిరాకరించాడు? ఆ నాటి గాంధర్వ వివాహానికి సాక్షులు ఎవరూ నిజంగా లేరా? ఆ సందిగ్ధాన్ని శకుంతల ఎలా ఎదుర్కొంది? అసలు భరతునికి రాజ్యం వస్తుందా? ఇవన్నీ తర్వాతి భాగం కథలో మనకు అర్థం అవుతాయి….