మహాభారతంలోని - దుష్యంతుడు, శకుంతల ప్రేమకథ గురించి విన్నారా? పార్ట్-3

Thumb Image

దుష్యంతుడు సభలో ఉన్నతాసనంలో ఆసీనుడై ఉన్నాడు. శకుంతల తన పుత్రుడైన భరతునితో పాటు సభలో ప్రవేశించింది. తన కుమారునికి ఈయనే నీ తండ్రిగారు అని చూపించి నమస్కరింపజేసి తానుకూడా నమస్కరించింది. అప్పుడు దుశ్యంత మహారాజు ఇలా అంటున్నాడు.  దుష్యంతుడు: “ఓ తరుణీ: నీ బిడ్డను తీసుకుని ఏ ప్రయోజనం కోరి వచ్చావో అడుగు!”

శకుంతల: “మహారాజా! వీడు మీ కుమారుడు. అలనాడు మీరు వేటకు వచ్చి కణ్వాశ్రమంలో గాంధర్వవిధిని నన్ను వివాహం చేసుకునే ముందు నా బిడ్డకు యువరాజు పదవి యిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకోవలసిన భారం మీ మీద ఉంది.” దుష్యంతుడు: “ఓ మూర్ఖురాలా: నువ్వెవరివి? నిన్ను నే నెప్పుడూ చూడలేదు. ఇటువంటి అసందర్భపు ప్రలాపాలు కట్టి పెట్టి బయటికి నడువు.”

శకుంతల : “మహారాజా : మీరు నన్ను చూడనేలేదా? గుర్తు తెచ్చుకోండి. పన్నెండేళ్ళ క్రితం వేటకువచ్చి మాలినీ నది తీరాన కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర నన్ను కలిసి మీరాడిన మాటలు మరవ కండి. పంచ భూతాలూ, సూర్య చంద్రులూ, అంతరాత్మ‐ఇవన్నీ మనం చేసే ప్రతిపనికీ సాక్షులు. వాటి కన్ను గప్పి ఎవరూ ఏమీ చెయ్యలేరు.

ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను కనక మీరు తిరస్కారభావంతో చూస్తున్నారు. మీ సభలో నా మాటలు అరణ్యరోదనంలా ఉన్నాయి. ఒక్కటి మరువకండి. పురుషుడు పుత్రరూపంలో భార్యాగర్భంలో ప్రవేశించి పితృదేవతలను ఉద్ధరిస్తాడు. పున్నామ నరకంమంచి కుమారుని వల్లనే బయటపడతాడు. భార్య అనేది తండ్రివలె పురుషుని హితవు కోరుతుంది. తల్లివలె ఓరిమితో ఓదారుస్తుంది. మిత్రుని వలె సాయపడుతుంది. లోకంలో ఎవరయినా భార్య కలవానినే విశ్వసిస్తారు. వివాహం కానివాడు ఎంత ధనవంతుడయినా ఆ పంపద, అడవికాసిన వెన్నెల. ఇన్ని విధాల తోడునీడగా ఉండాలి కనకనే భార్యను ఎన్నుకునేటప్పుడు రూపంతోపాటు గుణం, గుణంతో శీలం, శీలంతో సంప్రదాయ పదాచారాలు చూచుకుంటారు పెద్దలు.

భార్యగర్భం నుంచి ప్రభవించిన బాలుడు సర్వ విధాలా తండ్రిని పోలి ఉంటాడు. అద్దంలో ప్రతిబింబంలా కుమారునిలో తండ్రి రూపం సాక్షాత్కరిస్తుంది. అందువల్లనే పుత్రోదయ, దర్శనాలు తండ్రికి ఆహ్లాదం కలిగిస్తాయి.

దేశ భ్రష్టులయి, దుర్భర దారిద్ర్యం అనుభవించే వారయినా భార్య దగ్గర ఉంటే ఆ కష్టాలు మరచిపోతారు. అందువల్లనే భార్యను అనాదరంతో, ఆగ్రహంతో బాధించరాదు అని వివేకవంతులు చెపుతున్నారు. మహారాజా! అంతకంటె ప్రధాన ధర్మం ఉంది. అది పుత్ర వాత్సల్యం. పసితనంలో ఎక్కడ పడితే అక్కడ పాకుతూ, దుమ్ములో దొర్లుతూ, అల్లంత దూరంలో తండ్రి కనిపించే సరికి కిలకిల సవ్వుతూ వచ్చి రెండు కాళ్ళూ చుట్టివేసుకుని ఆశగా చూసే కొడుకుకంటె ఆనందం కలిగించే విషయం మరొకటి ఉన్నదా?

నామాట మీకు ఎంత చేదుగా ఉన్నా ఈ మీ కుమారుని వైపు చూడండి. మీ ఒడిలో కూర్చుని యువరాజు ఠీవిని ఒలికించాలనే కోరిక వీడి కన్నులలో మీకు కనిపిస్తుంది. చిన్న చిన్న చీమల నుంచి పక్షులు, పశువులు తమ సంతానం మీద ఎంతో ప్రేమతో ఉంటాయి. తన గూటిలో ఉన్న కోకిల గుడ్లను కూడా కాకి అమాయకంగా తన సంతానమే అని సాకి పొదుగుచున్నది. అది ఎరిగిన మీరు మీ కుమారుని విషయంలో అనాదరం చూపడం న్యాయం కాదు. సామాన్య మానవుడు కూడా తిరిగి తిరిగి యింటికి రాగానే తన బిడ్డలను దగ్గరగా తీసుకుని ముద్దులాడి పొంగిపోతాడు.

మరొక మాట : తన బిడ్డకు " జాతక కర్మ" జరుపుతూ "అంగాదంగాత్….. సంభవసి”

నా ప్రతి అవయవం నుంచి నీవు జన్మించావు. నా హృదయం నువ్వే. నా ఆత్మ నువ్వు. అటువంటి నీవు నూరేళ్ళు సుఖంగా బ్రతుకు అంటాడు. చూడండి నిర్మలమయిన కొలనిలో ప్రతిబింబంలా వీడు ముమ్మూర్తులా మిమ్ములను పోలి ఉన్నాడు”

అని అలా శకుంతల చెప్పుకు పోతున్నది. దుష్యంతుడు కదలకుండా పెదవి మెదపకుండా కూర్చున్నాడు. “మహారాజా ! రాజ కార్యాలలో మునిగి తేలే మీకు అన్ని విషయాలూ గుర్తుండవు. పన్నెండేళ్ళ క్రితం వేటకోసం అడవికి వచ్చారు. మీ బాణానికి అందక పరుగెత్తే లేడికోసం తిరుగుతూ మా ఆశ్రమంలో ప్రవేశించి గాంధర్వ విధానాన నన్ను పెళ్ళి చేసుకున్నారు.

అప్సరోథామాలలో అగ్రశ్రేణికి చెందిన మేనక నా తల్లి. తేజోవంతుడూ, తపస్వీ అయిన విశ్వామిత్రులవారు నా జనకులు. నన్ను పెంచిన జనకుడు బ్రహ్మర్షి కణ్వులు.

అటువంటి ఉత్తమురాలి నయిన నన్ను తియ్య తియ్యని మాటలతో పరిగ్రహించారు. ఆనాటి మన సమాగమ ఫలం ఈ బాలుడు, విశ్వరక్షకులైన మీరు నా ప్రాణ నాథులు. ధర్మ పరులయిన మీరు నన్ను మోసం చెయ్యకండి.

చిన్న వాడే నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు. ఇప్పుడు నా ప్రాణ నాథులయిన మీరు కూడా తిరస్కరిస్తున్నారు. కష్టాలు నాకు కొత్తకాదు. కాని ఈ బాలుడు మాత్రం మీ కుమారుడే” అని నిట్టూర్చింది.

దుష్యంతుడు: “శకుంతలా! సాధారణంగా అబద్ధాలాడడం ఆడవారికి సహజ గుణం. నీ మాటలు మరీ నమ్మలేనంత అబద్ధాల పుట్టలు ఎక్కడి విశ్వామిత్ర మహర్షి ! వారికి కలిగిన నువ్వు ఇలా కులటలా ప్రవర్తిస్తున్నావంటే నిన్ను నమ్మలేను. నువ్వు ఏమేమో కథలు చెపుతున్నావు. నా కసలు గుర్తులేవు.”

శకుంతల: మహారాజా! ధర్మ భ్రష్టులను త్రాచుపాముతో పోలుస్తారు. అందుకే భర్తృ హీనలకు నాస్తికులు కూడా భయపడతారు. మహారాజా ! వందనూతులు తవ్వించడం కంటే ఒక దిగుడుబావి నిర్మించడం మంచిది. అటువంటివి నూరు నిర్మించడం కంటే ఒక సత్క్రతువు మంచిది. అవి నూరు చెయ్యడం కంటె గుణవంతుడయిన కొడుకును కనడం శ్రేష్ఠం. కుమారులు నూరుగురికంటె ఒక్క సత్య వాక్యం శ్రేయోదాయకం. సత్యమే పరమేశ్వరరూపం. అందుచేత మీరు సత్యాన్ని మరువకండి. నన్ను విడిచినా బాధలేదు. నేను వెడతాను. ఆఖరు సారిగా ఇటు వీడి కన్నులలో మీ చూపుని నిలపండి. మీ కొడు అవునో కాదో తెలుస్తుంది.”

సరిగ్గా ఆ సమయానికి అశరీరవాణి ఇలా పలికింది. “మహారాజా! ఈమె నీ భార్య. వీడు నీకుమారుడు. ఆమె నిజం చెప్పింది.” ఆ మాటలు విని దుష్యంతుడు

“సభాసదులారా! విన్నారు కదా ధర్మదేవత పలుకులు. ఈమె చెప్పిందంతా నిజమే. కాని ముందుగా అంగీకరిస్తే మీరంతా ఈ పుణ్యశీలను శంకిస్తారని ఇంత సేపు ఆగాను.”

అని కొలువు చాలించి, శకుంతలా భరతులను దగ్గరగా తీసుకుని అంతఃపురానికి వెళ్ళి తన తల్లికి నమస్కరింపజేసి, విషయం వివరించి, ఆశీర్వాదాలు పొందాడు.

భారతంలో మొదటి ప్రేమ కథ ఇది. సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కల్గిస్తుంది. నాడు ధర్మం రక్షించి ఉండకపోతే ఈనాటి ప్రేమ కథే ఇది కూడా అయి ఉండేది.