భర్తను ఎలా వశం చేసుకోవాలి? మహాభారతం ఏం చెబుతోంది?

Thumb Image

     భారతంలో కూడా ఈ భామామణి ఉన్నదా ! అని ఆశ్చర్య పడేవారు లక్షకు పైగా ఉంటారు. కాని లక్ష శ్లోకాల మహాభారతంలో సత్యభామ ఉండేది అయిదారు నిముషాలు. ఆ కొంచెం సేపులోనే ఆవిడ మన మనస్సును పట్టుకుంటుంది, అది మీరే చూడండి.

శకుని ఆడిన మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కొద్ది రోజులలో అది పూర్తి అయి అజ్ఞాత వాసానికి వెళ్ళాలి. అటువంటి సమయంలో చుట్టపు చూపుగా వచ్చాడు వాసుదేవుడు. ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది. అక్కడ నాలుగయిదు రోజులు గడిపారు.

ఒకనాడు పాండవపత్ని ద్రౌపదీదేవి విశ్రాంతిగా ఉన్న వేళ, ఎవరూలేనిచోట, సత్యభామ ఆవిడ దగ్గరకు చేరి, కొంతసేపు లోకాభిరామాయణం అయ్యాక - “వదినా! ఒక్కమాట అడగాలని ఉంది. ఏమీ అనుకోకుండా, దాచుకోకుండా చెపుతావా? అంది. ద్రుపద రాజనందన చిరునవ్వు నవ్వి 'అదేమిటి వదినా ! నీ దగ్గర దాపరికం ఏవుంటుంది నాకు', అంది.

సత్యభామ: వదినా! ఇన్ని రోజులుగా చూస్తున్నాను. ఒక్క నాడు కూడా నీ అయిదుగురు భర్తలలో ఎవ్వరూ నిన్ను పరుషంగా పలకరించడం కాని, కన్ను లెర్రజేసి చూడడం కాని కనిపించదు. అందరూ అనురాగంతో ఆప్యాయంతోనే నిన్ను చూస్తున్నారు. ఈ విద్య ఎలా సాధించావు : ఏ మంత్రం వేస్తే, ఏ మందు పెడితే, ఏ వ్రతం చేస్తే, ఏ నది స్నానం చేస్తే యింతటి అనురాగాన్ని భర్తనుంచి పొందవచ్చునో చెప్పు' అంది.

ద్రౌపదీ దేవి అంతా విని, మందహాసం చేసి ‘వదినా! ఎంత అమాయకురాలివమ్మా: లోకోత్తర పురుషుడయిన మా అన్నయ్యకు భార్య వయిన నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా ! అయినా అడిగావు కనక విను. నువ్వు చెప్పిన వ్రతాలూ, నోములూ, స్నానాలూ, మందులూ, మాకులూ, మంత్రలూ, తంత్రాలూ మనకు కాదమ్మా.

పతివ్రతా ధర్మాలు తెలియని కులటలూ, నీచులూ అటువంటి వాటి కోసం ఆలోచిస్తారు. మనమనస్సులో ఆ వెర్రి ఊహ పుట్టనే కూడదు. పుట్టినా మరుక్షణంలో దానిని పారద్రోలి మనస్సును పతిసేవలో లగ్నం చేసి నిర్మలంగా ఉంచుకోవాలి.

భర్తను వశపరచుకొనేందుకు ఈ విధంగా మందులూ, మంత్రాలూ ఉపయోగిస్తున్న సంగతి వారికి తెలిసిందంటే యింక చెప్పాలా! పాముదూరిన యింటిని ఎలా చూస్తారో అలా చూస్తారు. వారి మనస్సు అశాంతితో నిండి, మనమీద ఉన్న ప్రేమ కూడా పోయి ద్వేషం పుడుతుంది.

ఎవరో ఏదో మందు తెచ్చి తినిపించమంటారు. దానివల్ల కొందరు మరణించారనీ, కొందరికి విపరీతంగా రోగాలు వచ్చాయనీ, మరికొందరు పిచ్చివారయి ఎందుకూ కొరగాకుండా పోయారనీ విని ఉంటావు.

ఈ మందుల వల్ల నడి వయసులోనే ముసలితనం వస్తుందనీ, కొందరికి మాట పడిపోయి మూగవారు అవుతారనీ, కొందరు చెవిటి వారయ్యారనీ వినే ఉంటావు. అందుచేత ఆ ఆలోచన వదులుకో.

నేను ఎలా సాధించానంటావా! అది చాలా సులభం వదినా ! ముందుగా అహంకారం వదిలేశాను. దురభిమానాన్ని దూరంగా తరిమాను. సాధ్యమయినంత పెదవి విప్పి మాట్లాడను. తప్పని సరి అయితే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడుతాను. ఏనాడూ కరకుగా, పరుషంగా మాట్లాడి ఎరగను. మాటతోనే కాదటమ్మా మనం ఎదుటివారి హృదయాన్ని జయించేది!

నిరంతరం వారి మనసు గ్రహించి దానికి అనుగుణంగా నడుచు కుంటాను. మాకు పరిచయం లేని కొత్తవారితో అసలు మాట్లాడను. ఎక్కడకు పడితే అక్కడకు వెళ్ళను. అనవసర విషయాలలో జోక్యం కలిగించుకోను.

వీరు ఏ పనిమీదనో అటూ ఇటూ వెళ్ళివస్తే వారు రాగానే నవ్వుతూ ఎదురు వెళ్ళి వారిసేవ కోసం ఎదురు చూస్తాను. వీరి అవసరాలన్ని నేను స్వయంగా చూసుకుంటానే తప్ప, అది మా దాసదాసీజనానికి విడిచి పెట్టను. వారు నాకు ఏ విషయం చెప్పినా దానిని రహస్యంగా దాచుతాను. ఎంత చిన్న విషయమయినా సరే, ఆ విషయం యితరులకు చెప్పను.

ఈ యింట్లో ఎవరికి ఏది యిష్టమో నాకు తెలుసు. ఆ పదార్థాలు స్వయంగా వండి, నేనే వడ్డించి, నవ్వుతూ మాట్లాడుతూ వారి చేత హాయిగా భోజనం చేయిస్తాను.

సోమరితనాన్ని నా దరిదాపులకు రానివ్వను. మా గృహం నిత్యం పరిశుభ్రంగా కలకల లాడుతూ ఉండేలా చూసుకుంటాను. వారితో మాటల సందర్భంలో అవసరమైతే నవ్వుతాము. అంతే తప్ప వెకిలినవ్వులు నవ్వుతూ నిలబడను.

ఇంద్రప్రస్థంలో యువరాజు పీఠంమీద వారిని ఎంత గౌరవంతో చూశానో, యీ వనవాసంలో కూడా అలానే చూస్తున్నాను. ఆ రోజులలో మా అత్తగారు కుంతీదేవి ఎవరితో ఎలా ఉండేవారో నేనూ అలానే గడుపుతున్నాను. ఏనాడూ ఆవిడమాటకు ఎదురు చెప్పలేదు.

  తెల్లవారుతుండగా నిద్రలేచి, నిర్మలమయిన మనస్సుతో నా పనులు నేనే చేసుకుంటాను. అక్కడ ఉన్న రోజులలో మా దాసదాసీ జనం యొక్క కష్టసుఖాలు స్వయంగా చూసుకునేదాన్ని.

అంతేకాదు, మా రాజభవనంలో వేదవేత్తలూ, వారి శిష్యులూ ఉండేవారు. అందరి భోజనభాజనాలూ సరిగ్గా సాగుతున్నది లేనిది చూసే పని ఎప్పుడూ మరిచిపోలేదు. అందరూ సుఖంగా నిద్రించే వరకూ నేను పడక గదిలో కాలుపెట్టను.

మా కోశాగారంలో ఎంత ఉన్నది, అది ఎలా వ్యయమవుతున్నదీ నాకు తెలుసు. ఆదాయం - వ్యయం ఎలా ఉంటున్నాయో చూసుకునే పని నాదే.

పని పాటా లేకుండా ఎవరి యింటికీ వెళ్ళకూడదు. అనవసరంగా కాలక్షేపానికి చేరి వారినీ వీరినీ నిందించే వారిని దరిజేర నివ్వరాదు. మరొక ముఖ్య విషయం కన్న కొడుకుతో అయినా సరే ఏకాంతంగా పురుషులతో ఉండకూడదు, భర్తతో తప్ప.

ఎప్పుడూ చిరునవ్వుతో, పూలుముడిచిన జుట్టుతో, పరిశుభ్రమయిన వస్త్రాలు ధరించి, అలంకారాలతో, భర్తసేవకోసం ఎదురు చూస్తూ ఉండాలి. మన బంధువులలో వీరికి దగ్గర వారెవరో, శత్రువు లెవరో, స్నేహితులెవరో తెలుసుకుని వారి వారికి తగినట్టు నడుచుకోవాలి.

నిత్యం సంతోషంతో ఉండాలి. అసంతృప్తి అనేది కలలోకికూడా రాకూడదు. ఈ సూత్రాలు ఆచరించిననాడు ఎటువంటి భర్త అయినా భార్య 'మీద అనురాగం వర్షిస్తూ ప్రాణ సఖిగా చూసుకొని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదినా : ఇవన్నీ నీకు తెలుసు. కాని నేను ఎలా ఉంటున్నానో చెప్పానంతే : అంది ద్రౌపదీ దేవి.