మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద నుంచి తెలివిగా తప్పించుకోవాలి. అంతే కానీ ఆ సమయంలో ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ కూర్చో కూడదు. అలా చేసేవారు తాము నష్టపోయేది కాకుండా మిగతావారి జీవితాలు కూడా నష్టపోయేలా చేస్తారు.
ప్రమాదం నుంచి బయటపడటానికి ఉపాయం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఎంత గొప్ప ఉపాయమైన నీళ్లన్నీ పోయాక చెరువుకు ఆనకట్ట వేసినట్టు జరగాల్సిన నష్టం అంతా జరిగాక ఎంత మంచి ఉపాయమైనా మనల్ని ఏమాత్రం ఉద్దరించదు. అలా కార్యహీనులైన గ్రామస్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పూర్వమొకానొక పట్టణమునకు సమీపముగ ఒక కుగ్రామం ఉండేది. ఆ ఊరిపేరు రామాపురం. అందులో అనేక మంది రైతులు కాపురం ఉండేవారు. ఆ ఊరు పది పంటలతో తులతుగుతూ ఉండేది. ఒక రోజు రాత్రి గ్రామస్తులందఱు నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి ఊరిలోని గుడిసెలకు నిప్పంటుకుంది. అది భగభాగమని మండిపోతుంది. గ్రామస్తులందఱు నిద్రలేచి వారివారి సామాన్లన్ని గబగబా బయటకు లాగారు, ఆ తర్వాత ఏమి చేయాలో అర్థంకాక అందఱు ఒక రచ్చబండపై జేరి ఏం చెయ్యాలో ఆలోచించసాగారు.
గ్రామశాసన సభయొక్క అత్యవసర సమావేశం ప్రారంభమైంది. అందులో ఉన్న ఒక వ్యక్తి లేచి "ఇది మనం ఆలోచించే సమయం కాదు, మనం అందరం వెళ్లి గుడిసెలకు ఉన్న తాటి ఆకులు పెరికేసి ఆ నిప్పు ఆరిపోయే విధంగా చెయ్యాలి, లేదంటే మనం పంట దాచుకున్న గోదాములవరకు నిప్పు చేరుకోగలదు’ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇంతలో అక్కడ సభలో ఉన్న మరో వ్యక్తి పైకి లేచాడు, “గౌరవ సభ్యుని అభిప్రాయముతో నేనేకీభవించను. ఎందుకంటే ఆ పని వల్ల నిప్పు పూర్తిగా శమించదు. కాబట్టి దగ్గరలో ఉన్న పట్టణానికి ఎవరైనా పరుగెత్తివెళ్లి నిప్పు చల్లార్చు యంత్రాన్ని (Fire Engine) తీసికొని వచ్చారంటే ఒక్క నిముషములో అది నిప్పంతటిని చాల్లార్చి వేయగలదు" అని చెప్పికూర్చుండెను.
ఈ ప్రకారముగ ఒక్కొక్కరు వారివారికి తోచిన అమూల్య భావములను, సలహాలను చెప్పుచుండగా అత్తటి సభామధ్యమునుండి ఒక పెద్దమనిషి లేచి "అయ్యా! ఈ మాటలన్నియు కట్టిపెట్టండి. మీరిచ్చిన సలహాలలో ఒకటియు సందర్భోచితముగ లేదు. నేనెంతయో ఆలోచించి చక్కని ఉపాయమును చెప్పుచున్నాను. దానిని విని ఆచరణలో పెట్టితిరా గ్రామమును అగ్నికి ఆహుతి కాకుండ తప్పించగలరు. లేకున్న మొత్తము పరశురామప్రీతి కాకుండ మానదు.” అని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
మన గ్రామం చాలా గొప్పది, కాబట్టి మనం అందరం దానిని రక్షించుకోవాలి. నేడు మన గ్రామానికి అగ్ని రగులుకుంది, కాబట్టి ఇప్పుడు అందరం కలసి కట్టుగా మన గ్రామాన్ని రక్షించుకోవాలి. నేను చెప్పబోవు ఉపాయమేమనగా, గ్రామస్తు లందఱు కూడా వారివారి పలుగులు, పారలు తెచ్చి మన అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఈ రచ్చ బండ సమీపముననే ఒక బావిని త్రవ్వామంటే కావలసినన్ని నీళ్లు దొరుకుతాయి. ఆ నీటిని ఉపయోగించి ఎంతటి అగ్నినైన మనం సులభంగా ఆరిపేయచ్చు. కాబట్టి ఇప్పుడే మనం అందరం ఆ పనికి పూనుకోవాలి ఇదే నా సందేశం” అని చెప్పి ఊరకున్నాడు.
ఇంతలో మంటలన్నీ అదుపుతప్పాయి, ఆ మంటలు అన్నీ ఈ రచ్చ బండను కూడా చుట్టుముట్టాయి. ఎవరికీ తప్పించుకోవడానికి మార్గం దొరకలేదు. అందరూ ఆ మంటలలోనే పడి అగ్నికి ఆహుతి అయ్యారు.
చూశారా ఆపదకాలంలో ఎంత మేధస్సు ఉన్నప్పటికీ ఆ మేధస్సుతో పని చేయకుండా కేవలం ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఎంతటి అనర్థం జరుగుతుందో అర్థం అయిందా. కావున మనం ఎప్పుడూ ఆపద కాలంలో మాటలకు పోకుండా కార్యోన్ముఖులుగా కర్తవ్యాన్ని ఉపాయంతో నిర్వహించి ఆ గండం నుంచి బయటపడాలి. అదే తెలివైనవాడు చేసే పని. అలా చెయ్యని మూర్ఖుడు ఆ గ్రామస్తుల వలే ఆపదలో చిక్కుకొని చివరకి మరణించినా ఆశ్చర్యపోనక్కరలేదు.