పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కండేయ ముని దర్శనభాగ్యం లభించింది. ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించారు. కుశల ప్రశ్నలు
సాగినవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన క్లేశాలకు ఆయన కొంత సేపు విచారించి, యింతకంటె దుఃఖాల పాలయిన శ్రీరామచంద్రుల కథ,
నలదమయంతుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించాడు. అలా వారికి ఏవేవో పురాతన రాజవంశాల గాథలూ, మహర్షుల విశేషాలూ చెపుతున్నాడు.
ఒకనాడు ధర్మరాజు వినయంగా, చేతులు జోడించి: 'మహర్షి! నాకొక ప్రశ్న వచ్చింది' అని అడగడానికి సంకోచించాడు. మార్కండేయుడు చిరునవ్వు నవ్వి:
'తెలియని విషయాలు తెలుసుకోవడం దోషం కాదు నాయనా ! నీ సందేహం ఏమిటి, అడుగు' అన్నాడు.
'మహామునీ : మాకు తెలిసినంత వరకూ మీరే చిరంజీవులు, మీరు కాక మరెవరయినా చిరంజీవులున్నారా' అని అడిగాడు. మార్కండేయ ముని చిరునవ్వుతో, తన తెల్లని పండు గడ్డం సవరించి, 'ధర్మనందనా ! మంచి ప్రశ్న అడిగావు. తప్పకుండా తెలుసుకో దగ్గది, సావధానంగా విను'.
ప్రాచీన కాలంలో ఇంద్రద్యుమ్నుడనే పేరుగల మహారాజు ఉండేవాడు. ఆయన ఎన్నెన్నో దానాలు చేశాడు. ప్రపంచంలో అంతటి ధర్మ పురుషుడు లేడని ఖ్యాతిని పొందాడు. రాజర్షిగా పేరుపొంది ప్రజలందరి మన్ననలూ పొందిన ఆ పుణ్య పురుషుడు కాలం చెల్లగానే స్వర్గం చేరాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పటికి ఆ మహారాజు పుణ్య కర్మలతో సాధించుకున్న ఫలం పూర్తిగా అయిపోయిందని క్రిందికి పంపేశారు.
భూలోకానికి వస్తుండగా నేను కనిపించాను. కనిపించగానే నన్ను చూచి: 'మహర్షీ! మీరు నన్ను ఎరుగుదురా?' అని అడిగాడు. అప్పటికి నేను చిరకాలంగా తీర్థయాత్రలతో, పుణ్యకర్మలతో, ఉపవాస వ్రతంతో కృశించి ఉన్నాను. అందుచేత 'నాకు గుర్తులేదయ్యా' అన్నాను.
'స్వామీ! మీకంటె ముందు పుట్టిన ప్రాణి ఏదయినా జీవించి ఉన్నదా?' అని అడిగాడు. 'హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావారకర్ణం అనే పేరు గల గుడ్లగూబ ఉంది అది నా కంటే పెద్దది. కొంచెం శ్రమ పడితే దానిని చూడగలవు, ' అన్నాను.
ఇంద్రద్యుమ్నుడు నన్ను వెంటబెట్టుకుని హిమాలయానికి వచ్చి ఆ గుడ్లగూబను చేరి : ‘'నువ్వు నన్ను ఎరుగుదువా' అని అన్నాడు. తెలియదని తల ఊపింది, ఆపక్షి. 'అయితే నీకంటె ముందు పుట్టిన వారిని ఎవరినయినా ఎరుగుదువా?' అని అడిగాడు.
'అయ్యా! ఇక్కడకు కొన్ని యోజనాల దూరంలో ఒక సరోవరం ఉంది. దానిని ఇంద్రద్యుమ్న సరోవరం అని పిలుస్తారు. ఆ కొలనులో నాడీజంఘమనే పేరు గల కొంగ ఉంటుంది. అది నా కంటే పెద్దది, ' అంది.
ముగ్గురూ కలిసి ఆ చెరువు దగ్గరకు చేరారు. ఆ మహారాజు మామూలు ప్రశ్న అడిగాడు. అప్పుడా కొంగ 'ఈ కొలనులోనే ఆకూపారం అనే పేరు గల తాబేలు ఉంది. అది నాకంటె ముందు పుట్టింది', అని జవాబిచ్చింది.
ఆకూపారాన్ని పిలిచి యిదే ప్రశ్న వేయగా, అది కన్నీరు విడుస్తూ: 'అయ్యా! ఆయన వెయ్యి మారులు యజ్ఞం చేసి వెయ్యి యూపస్తంభాలు వేయించాడు. ఆయన దానం చేసిన గోవుల రాకపోకలతో భూమి దిగబడి యింత సరోవరం అయింది. ఇదీ ఆయన చలవ ', అంది.
ఆ క్షణంలో దేవతలు ఆయనను స్వర్గం తీసుకు వెళ్ళారు. అంటే మన కీర్తి భూలోకంలో ఉన్నంత కాలం మనం స్వర్గంలో ఉంటాం.