మేనక విశ్వామిత్రుని ఏం చేసిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!!!

Thumb Image

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రామాయణంలో చాలా ముఖ్యమయిన పాత్ర నిర్వహిస్తాడు. భారతంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపోదీక్షలో ఉండగా కనిపిస్తాడు. అదికూడా శకుంతలకథలో ఒక సన్నివేశంలో ఈయన దర్శనం లభిస్తుంది: ప్రస్తుతకథ ఆదిపర్వంలోనిది. 

వసిష్ఠమహర్షితో వచ్చిన వైరంకారణంగా, ఆయనవలె బ్రహ్మర్షి కావాలనే కోరికతో విశ్వామిత్రుడు తీవ్రనియమాలతో తపస్సు చేస్తున్నాడు.

దేవేంద్రుడు ఆ తపోదీక్షకు భయపడి ఏ విధంగానయినా దానికి భంగం కలిగించాలని బాగా ఆలోచించి ఆలోచించి, ఏ మానవుడయినా కామినీ, కాంచనాలకు దాసుడవుతాడని నిశ్చయించుకున్నాడు.

ధనంకంటే మనిషిని సుందరీమణులే మరింతగా వంచించగలరని భావించి, అప్పరసలకు తలమానికమయిన మేనకను పిలిపించి ఇలా అన్నాడు. “అప్సరోజనశిరోమణి  ఇప్పుడు మా కొరకు దేవకార్యం సాధించవలసి ఉంది. నా వజ్రాయుధం పనిచెయ్యనిచోట్ల నీ కంటిచూపులు తీవ్రంగా పనిచేస్తాయని మేమెరుగుదుము. ఆ శక్తిని ప్రయోగించి కార్యం సాధించాలి.

విశ్వామిత్రమహర్షి పేరు విని ఉంటావు. ఆయన గాధిరాజ నందనుడు. రాజభోగాలన్నీ అనుభవించి, వసిష్ఠులవారితో యుద్ధానికిపోయి, ఆ బ్రహ్మవేత్తముందు ఆగలేక రాజశక్తికంటె బ్రహ్మవిదులశక్తి ఘన మయినదని గ్రహించి, దానిని సాధించడానికి తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. అదిమాకు సంతాపం కలిగిస్తున్నది. ఆయన దీక్షకు భంగం కలిగించడం సామాన్యవిషయంకాదు. ఆయన శక్తికూడా అసాధారణమయినది. నీ రూపం, లావణ్యం, నాట్య విద్యా ప్రావీణ్యం వీటితో ఆయన తపస్సమాధికి భంగం కలిగించాలి’' అన్నాడు.

ఆ మాటలు వింటున్న మేనక శరీరం ఆపాదమస్తకం కంపించింది. “ప్రభూ ! మీమాటకు ఏనాడూ ఎదురు చెప్పకుండా తలవంచి వెళ్ళి పనులు చేసుకువచ్చాం. కాని, విశ్వామిత్రులవారి పేరు వింటేనే మాకు గుండె దద్దరిల్లుతున్నది.

ఆయన సామర్థ్యం మీరెరుగనిది కాదు. ఆయన తపస్సు, తేజస్సు ఎంతటివో అంతకంటే పదిరెట్లు ఆయనకు క్రోధం. దీనికేకదా మీరు భయపడుతున్నారు: మీరే భయభ్రాంతులయ్యేచోట నా గతి ఏం కావాలి?

వసిష్ఠులవారి కొడుకు లందరినీ సంహరించిన క్రోధమూర్తి ఆయన. తపస్సుకి అంతరాయం కలగకుండా తన ఆశ్రమ సమీపంలో నదిని ప్రవహింప జేసుకున్న శక్తిశాలి. మతంగునిచేత యజ్ఞం చేయించినప్పుడు మీరు స్వయంగా వెళ్ళి సోమపానం చెయ్యక తప్పలేదు. వసిష్ఠులవారు శపించిన త్రిశంకునిచేత యజ్ఞంచేయించి, ఆయనకోసం త్రిశంకు స్వర్గం నిర్మించాడు.

ఆయన కన్నులెర్రజేస్తే ముల్లోకాలూ భస్మం అవుతాయి. కోపంతో భూమిమీద తన్నితే భూగోళం గజగజ వణుకుతుంది. మేరు పర్వతాన్ని గడ్డి పరకలా చూడగలడు. అంతటి మహామహుని దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారు. ఇది మీకు భావ్యమా!

అయినా మీ ఆజ్ఞ కనుక నేను వెలుతాను. అంతకుముందే ఆయన ఉన్న వనం అంతా వసంతశోభతో, మలయపవనాలతో, సుగంధ సౌరభంతో అలరారుతుండాలి. నేను ఆ మహర్షి ఎదుటకు వెలుతున్నప్పుడు వాయువు నా పైట చెరగును ఎగరవేసుకు పోవాలి. ఇన్నిటితోపాటు మన్మథుడు జాగరూకతతో తన పనిని కొనసాగించాలి. అప్పుడు మీ శాసనాన్ని నేను సక్రమంగా పాలించగలుగు తాను " అంది.

దేవేంద్రుడు చిరునవ్వుతో అన్నిటికీ అంగీకరించి పంపించాడు. మేనక అమరావతి విడిచి విశ్వామిత్రుని తపోవన వాటికకు వచ్చింది. అప్పటికే ఆశ్రమ పరిసరాలలో లతలు మొగ్గ తొడిగాయి. చెట్లు పూలతోనిండి సువాసన లీనుతున్నాయి. గాలి చల్లగా పోతున్నది.

పక్షులన్నీ అనురాగంతో ఒకదానినొకటి ముక్కులతో ముద్దులాడు కుంటున్నాయి. అటువంటి సమయంలో ఆశ్రమ సమీపాన తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రునికి అల్లంతదూరంలో నిలబడి, అభినయంతో చేతులు జోడించింది మేనక.

ఆమె చేతిగాజులు, కాలిఅందెల మువ్వలు కదలి సన్నగా ధ్వని చేస్తూ ఆ మహర్షి చెవులలో చేరుతున్నాయి. ఆయన మెల్ల మెల్లగా కన్నులు తెరిచే వేళకు ఆమె అంజలి బంధంతో నాట్యం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి గాలి విసురుతో ఆమె పైట కండువా ఎగిరి దూరంగా పడింది.

కన్నులు విప్పిచూశాడు విశ్వామిత్రుడు. చూస్తున్న విశ్వామిత్రుడు తపస్వి. చూసిన విశ్వామిత్రుని దీక్ష సడలింది, నెమ్మదిగా లేచాడు. ఆమె సిగ్గుతో వెనుదిరిగి పై కండువాకోసం అడుగులు వేస్తూ వెనుదిరిగి చూస్తున్నది. కనులు మిలమిలలాడిస్తున్నది. గాలి మరింత రేగింది. ఆమె పరికిణీ చక్రంలా తిరిగి పైకి లేచింది.

విశ్వామిత్రుని మనస్సు వివశమయింది. తన స్వాధీనం తప్పిన మనస్సులో కామవికారం పుట్టింది. కామక్రోధాలను జయించి బ్రహ్మర్షిపదం చేరాలనే పట్టుదలతో మానవ సంచారం లేని మహారణ్యంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్న విశ్వామిత్రుడు ఆ వనంలో ఏకాంతంలో పైటజారిన సుందరీమణి కనిపించేసరికి సర్వమూ మరిచిపోయి మనసులో మదనాతాపం రేగగా మేనకను చేరబిలిచాడు.

మేనక సిగ్గుతో, భయపడుతూన్నట్లు రాజహంసలా నెమ్మదిగా అడుగులో అడుగువేస్తూ ఆయనను సమీపించింది. విశ్వామిత్రుడు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. పది సంవత్సరాల కాలం గడిచింది. అంతా ఒక నిమిషంలా అనిపించింది, ఆ విశ్వామిత్రునికి.

అప్పటికి మేనక గర్భవతి అయింది. ప్రసవ కాలం సమీపిస్తున్నది. నాటికి తెలిసింది, విశ్వామిత్రునికి తను కామాన్ని జయించలేదని. అంతే మేనకను విడిచి ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు, తపో దీక్షతో. మేనక ప్రసవించి శిశువును మాలినీనదీ తీరాన ఒక చెట్టు క్రింద వదలి దేవలోకం చేరుకుంది.

ఆ అమ్మాయి పేరే శకుంతల.