రాజుగారి వింత కోరిక - గురువుగారి గొప్ప తెలివి, రాజుకు ఆ మాత్రం ఎలా చెప్పాడు?? కథ

Thumb Image

మనం చూస్తున్న దృశ్య ప్రపంచమంతా ఒకనాటికి నాశనం అయిపోతుంది. మనం జీవించే జీవితం నీటి బుడగ వంటిది, ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. జీవితమంతా సంసార బాధలతోనే మనిషి గడిపేస్తాడు. ఏ కొందరిలో కొందరికి మాత్రమే జీవితం విలువ తెలిసి ధార్మిక జీవనులుగా మారుతారు. అటువంటి వారిలో ఏ కొందరికి మాత్రమే గురువు లభిస్తాడు. అలా వారు ఉద్ధరింపబడి సంసారంలోని దుఃఖాలనన్నిటినీ నాశనం చేసుకొని ఆనందకరమైన జీవితం గడుపుతారు. అలా ధార్మిక బుద్ధి జనించి గురువుయొక్క అనుగ్రహంతో తన జీవిత గమనంలో సంసార దుఃఖాన్ని పోగొట్టుకున్న ఒక రాజు కథ మనం తెలుసుకుందాం!!!

పూర్వకాలం ఒక మహారాజు ఉండేవాడు. అతడు అంత్యంత శ్రీమంతుడు, యువకుడు, ధార్మికబుద్ధి కలవాడు. ఆ రాజుగారికి ఒక గురువు గారు ఉండేవారు. ఆయన గొప్ప తపస్సంపన్నుడు, ధార్మిక వేత్త, సూక్ష్మ బుద్ధి కలిగినవాడు. ఆ రాజు ఎప్పటినుంచో మంత్రోపదేశము చేయవలసి నదిగా ఆ గురువును చాలకాలము నుండి ప్రార్థించు ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాదు ఆ గురువుగారు ఆ రాజుకు మంత్రోపదేశం చేయాలని నిర్ణయించుకొన్నాడు. అయితే ఆ రాజు తన గురువుతో ఇలా అన్నాడు “ గురుదేవా! మీరు సర్వజ్ఞులు నాకు ఏ మతాన్ని ఉపదేశించాలో బాగుగా మీరు ఎరుగుదురు, నా యీ చిన్న విన్నపాన్ని ఆలకించండి, మీరు ఉపదేశించే మంత్రము నాకు మరపు రాకుండా ఉండేలా అనుగ్రహించండి” అని ప్రార్థించాడు, గురువుగారు అందులకు అంగీకరించారు.

సూక్ష్మ బుద్ధికలిగిన ఆ గురువుగారు చక్కగా ఆలోచించి 'ఇదికూడ ఎప్పటికైనను నశించి పోవును, అనే అర్థాన్ని ఇచ్చే “Even this shall pass away” ఇంగ్లీషు వాక్యాన్ని రాజుగారి వ్రేలియుంగముపై చెక్కించి అదియే మహా మంత్రమని, ఉంగరమును చూచినప్పుడల్ల అది జ్ఞాపకానికి వస్తుంది కాబట్టి మరచిపోయే అవకాశం లేదని చెప్పి రాజుగారిని పంపించేసాడు. ఆ రాజుగారు మహానందాన్ని పొందినవాడై రాజధానికి చేరుకున్నాడు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు రాజుగారు నిద్రలేవగానే వందిమాగధులు అతని చుట్టుజేరి “నీవు ఇంద్రుడవు, చంద్రుడవు” అని స్తుతించసాగారు. ఆ రాజుగారి చూపు అకస్మాత్తుగ తన వ్రేలి ఉంగరంపై పడింది. వెంటనే మహామంత్రము అతనికి కనిపించింది. “ఇది కూడా ఎప్పుటికైనను నశించిపోవునదే" ఈనాకీర్తి, ఈ వైభవము ఈ స్తోత్రములు- మూణ్ణాళ్ళముచ్చటే (Fame is a slow decay) అని తలచి మనసులో వారి స్తుతి పాఠములచే ప్రభావితుడు కాకుండా తటస్థంగా ఉన్నాడు.

అలా కొంతకాలం గడచింది. ఒకనాడు సామంతరాజులు నాలుగు దిక్కుల నుండి తాము జయించిన రాజ్యాల నుండి కొల్లగొట్టి తెచ్చిన రత్నాలను, వజ్రవైఢూర్యాలను, సువర్ణాది ఆభరాణాలను ఆస్థానంలో మహా రాజు సమీపంలో కుప్పలు కుప్పలుగా పోసారు. రాజుయొక్క ఆనందం మేరలేదు. కాని ఆ సంతోషించాల్సిన సమయంలో తటాలున అతని దృష్టి ఉంగరము పైకి పోగా గురువు చెప్పిన మహామంత్రం, తదర్థము జ్ఞప్తికి వచ్చింది. "ఇది కూడ ఎప్పటికైనను నశించిపోవును" కావున ఈ రత్న రాసులను జూచి మురిసిపోగూడదు. ఈ సిరిసంపదలు ఏనుగు తినిన వెలగపండును బోలియుండును. ఈనాటి లక్షాధికారి విధి వైపరీత్యముచే రేపు భిక్షాధికారియై పోగలడు. ఇట్టి చంచల వైభవములందు మమత్వమేల? అని లోలోన తలంచుకొని సంపదలయందు నిర్లిప్తుడై తటస్థంగా ఉండిపోయాడు.

మఱి కొంతకాలం గడచిన మీదట రాజుగారికి వివాహము నిశ్చయమైంది. దూరదూర ప్రాంతముల నుండి మహారాజు లందఱు సుముహూర్తమునకు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసారు, వివాహక్రతువు పూర్తిగా నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఆనాటిరాత్రి వధూవరుల ఉరేగింపుకు సర్వసన్నాహాలు సిద్ధం చేయబడ్డాయి. నవరత్న ఖచితములైన బంగారు పల్లకిలో నూతన దంపతులను కూర్చోబెట్టి రాజలాంఛనాలతో బ్రహ్మాండమైన ఊరేగింపు నిర్వహించారు. మేళ తాళాలు, నృత్యాలు, పాటలు వీతన్నిటితో ఉండే ఆ దృశ్యం కనుల పండువుగ కనిపించింది. పెండ్లి పెద్దలు ముందు నడుస్తున్నారు, వెనుక దివ్యాలంకారాలతో శోభిస్తూ పల్లకిలో వధూవరు లాసీనులై వస్తున్నారు. జయజయ ధ్వానాలచే దిక్కులు పిక్కటిల్లుతున్నాయి.

ఆనందాతిరేక సమయంలో అకస్మాత్తుగా రాజుదృష్టి చేతి ఉంగరంపై పడింది. “ఇదికూడ ఎప్పటికైనను నశించిపోవును” అను ఆ మంత్రము స్మృతిథంలో వెలిగింది నా యెదురుగ కూర్చొనియున్న ఈ పెండ్లికూతురు కాలగర్భమున ఎప్పటికైనను విలీనమైపోవు ఒకానొక పాంచభౌతిక పదార్థము మాత్రమే, ఇది రక్తమాంసములతోగూడిన తోలు బొమ్మయే. పంచభూతముల సమ్మే ళనమువలన ఏర్పడిన ఆకృతిమాత్రమే (Human flesh is clay)”అని మనసులో తలచుకొని లోలోన విరాగమును పొందాడు. అప్పటినుండి అతడు పైకి వ్యవహారార్థము రాజవిధులను నిర్వర్తిస్థూ, లోలోన ప్రపంచం యొక్క వాస్తవ స్వరూపాన్ని గుర్తెరుగుటచే పరమవిరక్తి గలవాడై, నిర్లిప్తుడై మెలగుచు నిరతిశయ శాంతిని పొందాడు.

నీతి:- ప్రపంచములో గల సమస్త పదార్థములు నశ్వరాలు సుఖదుఃఖములేవైన ఎల్లకాలము ఉండవని తలచి మనుజుడు ధైర్యవంతుడై వైరాగ్యోపేతుడై ప్రవర్తించాలి.