నాయనా! ఇక్కడకు సమీపంలోనే ఒకానొక దివ్యమైన సరోవరం ఉంది. అది కలువలతో, కమలాలతో, వివిధరకముల జలపక్షులతో నయనానందకరంగా
ఉంటుంది. ఆ సరోవరంలో ఒక పెద్ద కచ్ఛపం(తాబేలు) ఉన్నది. కొలను ఒడ్డునే ఒక మదగజం ఉన్నది. ఈ ఏనుగు తన పొడుగాటి తొండంతో ఆ తాబేలునుపట్టిలాగి
హింసిస్తూండేది. తాబేలు ఏనుగుకాళ్ళుపట్టి లోపలకు ఈడ్చి హింసపెడుతూ ఉండేది. అలా అవి ఎన్నో యేళ్ళుగా కొట్టుకుంటున్నాయి. ఆ రెండు జంతువులూ నీకు
ఆహారంగా సరిపోతాయి అన్నాడు.
అదివినిన గరుత్మంతుడు : "పితృపూజ్య ! వాటిమధ్య ద్వేషకారణం ఏమిటి? ఏనుగుతో తాబేలుకు పోరాటం ఎలా సంభవం' అని ప్రశ్నించాడు.
కశ్యపుడు : " నాయనా ! ఆ ప్రాణులు రెండూ పూర్వజన్మలో మానవులు, అన్నదమ్ములుగా పుట్టాయి. పెద్దవాడు విభాసుడు. రెండోవాడు సుప్రతీకుడు. ఇద్దరు నిత్యం ప్రాతః కాలంలో లేచి స్నానసంధ్యాదులు ముగించి, నియమవ్రత పరాయణులయి పరబ్రహ్మను ఆరాధించేవారు. అయితే వారికి కొంత ధనసంపద ఉంది. ఆ ధనంలో తనవంతు తనకు పంచిపెట్టమన్నాడు సుప్రతీకుడు.”
అంతలో విభాసుడికి ఆగ్రహం వచ్చి 'అన్నగారి మాటమీద గౌరవంలేకుండా ఉన్న నువ్వు మహారణ్యంలో ఏనుగు గర్భానపడి, గజజన్మ ఎత్తుదువుగాక!' అని శపించాడు. సుప్రతీకుడు మరింతకోపంతో తాబేలువై పుడతావు నవ్వు' అని శపించాడు.
'అదే అరణ్యంలో, చెరువులో, ఇద్దరూ పవిత్రమానవ శరీరాలు విడిచి జంతువు లయ్యారు. అది మొదలుగా ఆ ఏనుగు గట్టుమీదనిలిచి ఘీంకరిస్తుంది. తాబేలూ నీటిమీద తేలి అలలు రేపుతుంది. యుద్ధం ఆరంభ మవుతుంది. అలా అవి నిర్విరామంగా పోరాడుకుంటున్నాయి ఆ చెరువులో.
ఆ ఏనుగు ఎత్తు ఆరు యోజనాలు, పొడవు పన్నెండు యోజనాలు. తాబేలు చుట్టుకొలత పది యోజనాలు, మందం మూడు యోజనాలు. ఈ రెండు జంతువుల సంగ్రామంలో ఆ సరోవరం, దాని పరిసర వనాలు గగ్గోలయి పోతున్నాయి. ఆ చెరువులో నీరు తాగడానికి అవకాశం లేదు. ఆ వనంలో ఏ మృగమూ హాయిగా ఆహారం తీసుకు తిరగడానికి అవకాశంలేదు.
ఆ రెండుజంతువులనూ నువ్వు ఆహారంగా తీసుకుంటే అప్పుడు ఆ చెరువూ, వనమూ, మరికొన్ని ప్రాణులకు ఆధారమవుతాయి. ఆ ప్రాంతంలో పక్షులూ, జంతువులూ స్వేచ్ఛగా తిని, తాగి, తిరుగుతాయి. వెళ్ళు, నీకు శుభం" అని తండ్రి ఆశీర్వదించాడు,
గరుత్మంతుడు తండ్రికి నమస్కారంచేసి సెలవు తీసుకున్నాడు. ఒకసారి ఆకాశానికి ఎగిరి, సరాసరి ఆ సరోవర ప్రాంతానికి వచ్చి చూశాడు. తొండం ఎత్తి ఏనుగు ఘీంకరిస్తున్నది. తాబేలు అలలు రేపుతున్నది. ఒక్కవూపులో క్రిందకు దిగి, గరుత్మంతుడు ఒక కాలిగోళ్ళకు తాబేలును తగిలించి, రెండవ కాలిగోళ్ళతో ఏనుగును అందుకుని విశాలమైన పర్వత శిఖరానికి పోయి హాయిగా ఆరగించాడు. ఈ విధంగా ఆ అన్నదమ్ములపోరు ముగిసింది.
ఈ కథను విన్నవారే దీర్ఘకాలంసాగే పోటీలనూ, పోరాటాలనూ గజకచ్ఛపసంగ్రామంతో పోలుస్తూంటారు.