చాలా రోజులక్రితం మాట. అగస్త్యుడనే పేరుగల బ్రహ్మచారి ఉండేవాడు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వ ప్రాణికోటినీ దయాహృదయంతో చూసే వాడు.
ఆయన తపోదీక్ష మహామహులెందరికో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతూండగా వాని పితృ పితామహులు కనిపించి: 'నాయనా, యోగ్యురాలయిన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు అన్నారు.
కులవృద్ధుల మాట శిరసావహించి అగస్త్యుడు తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు. తిరిగి తిరిగి విదర్భదేశం చేరాడు. ఆ రాజుగారి యింట మెరపు తీగెవంటి లావణ్యంతో, నిర్మల సరోవరంలోని నల్ల కలువ వలె పెరుగుతున్న లోపాముద్రమ చూశాడు. అందచందాలలోనే కాదు వినయ గుణశీలాలలో కూడా ఆమె యోగ్యురాలని గ్రహించాడు.
ఆ మహారాజు అగస్త్య మహర్షి రాగానే ఆయనకు స్వాగతం వలికి, అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. వారి పరిచర్యలకు సంతోషించి ఆ మునిచంద్రుడు:'మహారాజా! మా వంశాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానం కోసం నీ కుమార్తెను నా భార్యగా కోరుతున్నాను' అన్నాడు. మహారాజు గుండె దడ దడ లాడింది. మనస్సు ఆందోళనలో పడింది. చీనిచీనాంబరాలతో మణిరత్న భూషణాలతో, హంసతూలికా తల్పాలమీద రాజభవనంలో వందలాది దాసీజనాల సేవలందుకుంటూ ఇంద్రభోగం అనుభవించవలసిన తన కూతురు, ఈ మునీశ్వరుడి భార్యగా వనవాసం చేస్తూ పటకుటీరాలలో నార చీరలు ధరించి, కందమూల ఫలాలు తింటూ జీవించగలదా ? అనే సందేహంలో పడ్డాడు.
ఈ వార్త విని మహారాణి విచార సాగరంలో మునిగింది. అది చూసి లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి: 'నా వల్ల మీరు కష్టాలపాలు కానవసరం లేదు. నేను సంతోషంతో ఈ మునీశ్వరుని భార్యగా, ఆయన సేవచేసి వారి అనుగ్రహం పొందుతాను' అంది. విధి విహితంగా లోపాముద్రా పరిణయం జరిపించాడు మహారాజు.
లోపాముద్ర తన ఆభరణాలు, చీని చీనాంబరాలు విడిచి నార చీరలతో సామాన్య మునిపత్ని వేషంతో ఆయన వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతిసేవలో ఆయన హృదయాన్ని చూరగొన్నది.
గంగానదీ తీరాన రమణీయ వనంలో పట కుటీరంలో రాజపుత్రిక నార చీరలతో చలిగాలులూ, వేడిగాడ్పులూ లెక్కచెయ్యకుండా ఎంతో ఓరిమితో సేవలు చెయ్యడం ఆ మునిని ఎంతగానో అలరించింది. అయినా ఆయన తన ఋషిధర్మాన్ని విడువకుండా వేదవిహిత కర్మలే కొనసాగిస్తున్నాడు. రోజులు సాగిపోతున్నాయి. కాలచక్రం తిరుగుతున్నది.
ఆ విధంగా కొంతకాలం గడిచాక ఒకనాడు లోపాముద్ర ఋతుస్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడయాడుచుండగా మహర్షి మనస్సు చలించింది. ఆమెను చేరబిలిచి, చెయ్యిపుచ్చుకుని; బుగ్గ ముద్దాడబోగా ఆమె మందహాసంతో వెనుదిరిగి: 'స్వామీ! ఆశ్రమ ధర్మానుసారం మనం ఈ పట కుటీరంలో దర్భశయ్యలమీద జీవితం గడుపుతున్నాం. ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే, నేను మానాన్నగారింట ఏ భోగభాగ్యాలతో ఉండే దానినో అవి సమకూర్చగలిగితే, సుఖంగా ఆ సంతోషం మీకు అందివ్వగలను' అని క్షణం ఆగి, మీ వంటి మహా తపస్వికి అవి సమకూర్చడం నిమిషాలలో పని. నా ఋతుకాలం పూర్తి కాకుండా అవి సమకూర్పండి' అని అంది.
ఆలోచించాడు, ఆ మునీశ్వరుడు. ఈ సాంసారిక సుఖంకోసం తపశ్శక్తిని వ్యయం చేయడం యిష్టం లేకపోయింది. ఏ మహారాజు నయినా అర్థించాలని బయలు దేరాడు. వెళ్ళి ముగ్గురు మహారాజులను దర్శించి : 'ఎవరికీ కష్టం కలగకుండా మీ ఆదాయంలో నాకెంత దానం చెయ్యగలరు', అని అడిగాడు. వారందరూ తమ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయన్నారు.
వారి సూచనానుసారం ఇల్వలుడనే దానవరాజు దగ్గర కావలసిన సంపదలన్నీ ఉన్నాయన్నారు. ఆయన ఈ రాజులను వెంటబెట్టుకుని అదే పనిగా బయలుదేరాడు.
ఈ ఇల్వలుడు వాతాపిసోదరుడు. వారిద్దరూ ఒక అరణ్యంలో ఉంటూ ఆ దారిని వచ్చేవారిని భోజనానికి పిలుస్తారు. వారు రాగానే వాతాపి మేకలా మారిపోతాడు. ఆ మేకను చంపి వండి పెడతాడు, ఇల్వలుడు. వారు హాయిగా భుజించాక ఇల్వలుడు: 'సోదరా, వాతాపీ'' అని పిలవగానే వాడు పొట్ట చీల్చుకుని బయటపడగానే అన్న దమ్ములిద్దరూ ఆ అతిథిని వండుకు తింటారు. అది వారి జీవన విధానం.
అగస్త్యుడు తనతో రాజులను వెంటబెట్టుకుని రాగానే వినయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆశ్రమానికి తీసుకు వెళ్ళారు. వారి ఎదురుగానే మేకను వండిపెట్టబోగా ఆ రాజులు భయంతో మునివైపు చూశారు. ఆయన వారికి అభయమిచ్చి వండినదంతా ముందు నాకు వడ్డించు. మిగిలితే వారి విషయం చూద్దాం' అన్నాడు.
సరిగ్గా అదే సమయానికి ఇల్వలుడు సోదరా! వాతాపీ': అని అరిచాడు. అదివిని అగస్త్యుడు: 'ఇంకా ఎక్కడ వాతాపి : వాడింక తిరిగి రాడు', అని నవ్వగా ఇల్వలుడు భయపడి : 'స్వామి: క్షమించండి' మీకు నా సర్వ సంపదలూ యిస్తాను, అని తన వద్ద నున్న మణిరత్న సువర్ణ రాసులు రథంమీద ఉంచి ఆయనకు అర్పించాడు.
ఆయన కదలబోతుండగా ఆయనను సంహరించబోగా మహర్షి వెను తిరిగి హుంకరించాడు. ఇల్వలుని దేహం గుప్పెడు బూడిద అయిపోయింది.
మహాముని ఆ సంపదతో ఆశ్రమానికి వచ్చి: ధర్మచారిణీ ! లోకంలో అందరిలా ఉండే పుత్రులు, అసంఖ్యాకంగా కావాలా? గుణశీలవంతుడయిన కుమారుడు ఒకడు కావాలా? అని అడిగారు. ఆవిడ గుణవంతు డొకడు చాలునంది. అనంతరం ఆ దంపతుల సంసార యాత్రాఫలంగా దృఢదస్యుడనే మహాతపస్వి ప్రభవించాడు.
వాతాపి జీర్ణం జీర్ణం జీర్ణం వాతాపిజీర్ణం అనే నానుడి ఈ కథ వల్ల పుట్టింది. ఇది భోజనానంతరం ఉచ్చరిస్తే తిన్నది బాగ జీర్ణమవుతుందని పెద్దలు అంటారు.