రాయబారానికి వెళ్ళాడు సంజయుడు. శుష్కప్రియాలతో వెళ్ళి, శూన్యహస్తాలతో తిరిగివచ్చాడు. వస్తూనే ధృతరాష్ట్ర మహారాజును దర్శించి, రాయబారం విఫలమయిందని, విశేషాలన్నీ మరుసటి ఉదయం మహాసభలో కురు, గురు, వృద్ధబాంధవమంత్రి, సామంత, దండనాథులందరూ ఉండగా వివరంగా చెపుతానని స్వగృహానికి వెళ్ళాడు.
సంజయుడు వెళ్ళడంతో మహారాజు మనసు మథనపడసాగింది. కుటుంబ కలహం ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళనతో ఆ వృధ్ధ రాజు హృదయంలో కల్లోలం పుట్టింది. రాత్రికి రాత్రి మనశ్శాంతి కలిగించే ప్రియవాక్యాలు వింటూ నిద్రపోదామని మహామంత్రి విదురునికి కబురు చేశాడు. కౌరవసామ్రాజ్యానికి నిండుగౌరవం తెచ్చే మంత్రి పదవిని నిరాడంబరంగా నిర్వహించే నిరహంకారుడు, నిశ్చలమనస్కుడైన విదురుడు మహారాజు పిలుపును రాత్రివేళ అందుకోవడం అదే మొదటి సారి.
మొదటిసారే ఆయినా అ ధీవిశారదుడు నిశ్చలచిత్తంతో రాజమందిరానికి విచ్చేసి తనరాకను ద్వారపాలకునిద్వారా మహారాజుకి తెలియ జేశాడు. తక్షణం లోపలకు రమ్మని అనుజ్ఞ అయింది.
విదురుడువచ్చి నమస్కరించి, రాజాజ్ఞానుసారం ఆసీనుడయ్యాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తనకు నిద్ర పట్టటంలేదనీ, హృదయానికి శాంతి కలిగించేమాటలు చెప్పవలసిందనీ అడిగాడు.
"మహారాజా! మీకు నిద్రపట్టడంలేదంటే నాకు చిత్రంగా ఉంది. బలవంతునితో విరోధంతెచ్చుకున్న దుర్బలులకూ, ఇతరుల సంపదను హరించినవారికీ, కామం పెచ్చు పెరిగినవారికీ, దొంగలకూమాత్రమే రాత్రి నిద్రపట్టదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ లక్షణాలన్నీ మీకున్నట్లు నే నెరుగుదును. అటువంటప్పుడు మీకు నిద్రపట్టకపోవడానికి కారణం ఏమిటో నా కవగాహన కావడంలేదు .
అని ఎదురుప్రశ్న వేయడంతో ధృతరాష్ట్రుడు కొంచెం చికాగ్గా- 'నేను నీ ముఖంనుండి ధర్మప్రవచనమే కోరుతున్నాను' అన్నాడు. మహారాజా! ఉత్తమగుణాలూ, ఉన్నతాశయాలూ, ఉదాత్త ధర్మాలూ కల ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. కాగలిగినశక్తి ఉన్నా ఆ కుంతీసుతుడు మీ మాటకెన్నడూ ఎదురు చెప్పలేదు. అయినా మీరు వారిని కారడవులకు పంపారు. మీకు బుద్ధిలేదనీ, ధర్మజ్ఞులుగారనీ అనలేం. అయినా వాటిని అనుసరించే వృష్టి మీకు లోపించింది. వారికి రావలసిన రాజ్యభాగంకూడా వారి కివ్వలేని స్థితిలో ఉన్నారు మీరు.
దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాది అయోగ్యులపై అపరిమితమైన విశ్వాసం ఉంచి ఈ సామ్రాజ్య భారం అంతా వారిచేతులలో ఉంచారు. అలా ఉంచి శాంతిని వాంఛించడం వివేకమా మహారాజా!
సాత్త్విక స్వభావమూ, ఉద్యోగయత్నమూ, క్లేశపహనమూ, ధర్మబద్ధ దృష్టికల పురుషుడు ఎన్నడూ వంచితుడుకాడు. ఇటువంటి విద్వాంసులు దుష్టులకు దూరంగా ఉంటారు. మహారాజా ! ధర్మార్థాలను అనుసరిస్తూ, లోకవ్యవహారం గ్రహిస్తూ, భోగచింతలేకుండా పురుషార్థాలు సేవిస్తూ, అప్రస్తుతప్రసంగాలు చెయ్యకుండా, దుర్లథాలు వాంఛించ కుండా, పోయినవాటికోసం శోకించకుండా, ఎటువంటి విపత్తులువచ్చినా, ధైర్యంకోల్పోకుండా, ప్రారంభించిన పనిని నిర్విఘ్నంగా పరిసమాప్తం చెయ్యనిదే విడువకుండా, సోమరితనాన్ని దరిజేరనివ్వకుండా, మనస్పును స్వాధీనంలో ఉంచుకోగలవాడే విద్వాంసుడు.
ఆదరిస్తే ఆనందిస్తూ, అనాదరానికి అగ్రహం పొందడం విద్వాంసుల లక్షణంకాదు. వారిహృదయం గంభీరంగా గంగావది సదృశంగా ఉంటుంది. విద్వాంసులబుద్ధి విద్యను అనుసరిస్తుంది. విద్య వారి బుద్ధికి అదుపులో ఉంటుంది. విద్యా వివేకమూ, లేకుండా గర్వంతో చరించే వాడు మూర్ఖుడు. దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతూ, లేనిపోని ఆశలు పెట్టుకునేవాడూ, అంతే.
స్వీయ ధర్మం విడిచి, యితరుల మార్గాలలో సాగేవాడూ, స్నేహితులతో అసంబద్ధంగా చరించేవాడూ, శత్రువులతో సఖ్యంగా ఉంటూ, బలవంతునితో వైరం పెంచుకునేవాడూ, మిత్రశూన్యుడూ, ఎదుటివారు కోరకుండానే సంభాషించేవాడూ, కృతఘ్నులను విశ్వసించేవాడూ, పరులలో దోషాలే చూచేవాడూ, అకారణంగా ఆవేశానికి లొంగేవాడూ, అనర్హులకు ఉపదేశాలిచ్చేవాడూ వీరందరూ మూర్ఖులే ప్రభూ ! విద్యా, దానాలు ఎంత విరివిగా ఉన్నా, ఆ రెండింటితో అహంకారం లేకుండా ఉండేవాడే విద్వాంసుడు.
తనపోషణలో ఉన్నవారికి భోజనభాజనాలు సమకూర్చకుండా తన పొట్టనింపుకునేవాడు పరమమూర్ఖుడు. విషం ఉన్నదే - అది త్రాగినవానినే చంపుతుంది. వాడిమొన కలిగిన బాణం గుచ్చుకున్నవాడే యమసదనం చేరుతాడు. మరి ప్రజలో ! ఈ ప్రజాసమూహం ప్రభువును పదభ్రష్టునిచేసి, పరలోకానికే పంపగలరు.
విధి నిషేధాలు
మహారాజా !
ఏకాకిగా – అంటే ఒంటరిగా భోజనంచెయ్యకూడదు. విషమ సమస్యలు ఎదురయినప్పుడు తనకుతానై నిశ్చయాలు తీసుకోకూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ నిద్రిస్తూంటే ఒక్కడుగా మేల్కొని ఉండరాదు.
సహనశక్తికలవారిలో అసమర్థత ఉంటుందని అంటారు. కాని, అసమర్థులలో సహనం ఉండనే ఉండదు. క్షమ కంటే బలీయ మయినది లేదు. అది పురుషులకు అలంకారంకూడా. అల్పబుద్ధులనూ, అదే పనిగా అలోచించే వారినీ, త్వరత్వరగా నిర్ణయాలు మార్చేవారినీ, స్తోత్ర పాఠకులనూ రహస్య సమాలోచనకు ఆహ్వానించ కూడదు.
కుటుంబంలోని వృద్ధులనూ, దారిద్ర్యంలో పడ్డ ఉన్నత కుటుంబీకులనూ, అటువంటి దశనే అనుభవించే స్నేహితులనూ, సంతాన విహీనయై, భర్తను కోల్పోయిన సోదరినీ, ఆదరించి అశ్రయమిచ్చి పోషించాలి.
సమయం, సందర్భం లేకుండా కోపం తెచ్చుకునేవాడూ, సేవకుల కష్ట సుఖాలతో నిమిత్తం లేకుండా వారిచేత సేవ చేయించుకునే వాడూ, వారి కృషికి తగిన వేతనాలూ, బహుమతులూ యివ్వని ప్రభువును అచిరకాలంలోనే ప్రజలు క్రిందికి దింపుతారు.
ప్రభూ! పన్నులు పసూలు చేయడంలో కూడా అధికారులు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. పూలదండలు కట్టేవాడు మొక్కని ఏ చేటు రాకుండా దాన్ని పెంచుతూనే పువ్వులు కోసేట్టు, పన్నులు వసూలు చెయ్యాలే తప్ప, బొగ్గులవ్యాపారిలా చెట్టు మొదలంటా నరకకూడదు. గో, నారి, విప్రజనులమీద, స్వజనంమీద శౌర్యం ప్రకటించే వారు ఆరమగ్గిన పండులా నేల కూలుతారు.
మహారాజా! విశాల ప్రాంతంలో ఒక్కటిగా పెరిగే చెట్టు గట్టి వ్రేళ్ళతో బలంగా పెరుగవచ్చు. కాని, ఒక్క గాలివాన విసరిందో- సమూలంగా నేలకూలి పోతుంది. అదే వృక్ష సమూహం మధ్యలో ఉంటే – అప్పుడది అంత సులభంగా గాలికి ఒరిగిపోదు. అందు చేతనే సజ్జనులు సంఘంగా ఉండాలనీ, వారంతా పరస్పర సహకారంతో చరించాలనీ, బుధులు చెబుతూ ఉంటారు.
ఆకాశాన్ని పిడికిటి పోటుతో వంచేద్దామమకునే వాడూ, ఇంద్రధమస్సును తన బాహు బలంతో వంచుదామనుకునేవాడూ, సూర్యకిరణాలను దోసిట పడదామమకునే వాడూ, వీరందరూ మూర్ఖులే అంటారు స్వాయంభువ మనువు.
ప్రియం – హితం
మనకు ప్రీతికలిగే మాటలు చెప్పేవారు అయాచితంగానే అనేకులు లభిస్తారు. కాని, మన శ్రేయస్సుకోరి హితవు చెప్పేవాడు దొరకడు. ఓవేళ హితబోధ చేసే వారున్నా, వినేవాడుండడు. ధర్మదృష్టి విడువకుండా స్వామియొక్క ప్రియాప్రియాలతో నిమిత్తం లేకుండా హితవు చెప్పగలవాడే ఉత్తమ సేవకుడు. సేవకుల జీవనభారం గ్రహించి వారికి వేతనా లివ్వకపోయినా, మంత్రులు భోగవంచితు లయినా ఆ ప్రభువు పదచ్యుతుడు కాక తప్పదు.
అహంకారంతో ప్రభువుకు ప్రతికూలంగా చరించేవానిని, మరుక్షణమే పదవి నుండి తొలగించాలి. ప్రభువుకుగల బలాలలో బాహుబలం మొదటిదే అయినా, దాన్ని ఘనంగా భావించరాదు. ఇక రెండవ బలం ఉత్తముడయిన మంత్రి, తరువాత ధనబలం. పితృ, పితామహ ప్రాప్తమున్నదే అది సహజబలం. అన్నింటినీ మించినది బుద్ధిబలం. స్త్రీ - సౌభాగ్యశాలిని. కనుక ఆమె గృహాలంకారం. అందుకే ఆమెను రక్షించు కోవడం పురుషుని విధి.
మహారాజా ! సర్వసద్గుణ సంపన్నులూ, ధర్మ మర్మజ్ఞులూ అయిన పాండవులతో విరోధం ఉచితం కాదు. అందుచేత వారిభాగం వారికిచ్చి సంతోషించండి', అన్నాడు.