మహా విద్వాంసుడూ, భారత వంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రీ అయిన విదురుడు తన ప్రభువు అవివేకాన్ని వేలెత్తి చూపుతూ చెబుతున్నాడు.
ప్రభూ ! ధనవంతుడున్నాడే వాడు హాయిగా సుఖపడుతూ భోగమయ జీవితం గడుపుతూ తృప్తి పడకూడదు. పదిమందికీ పెట్టి, పేద వారికి దాన ధర్మాలు చేస్తూండాలి. దానం చేసేటప్పుడు చిరాకుతో, విసుగుతో చెయ్యకూడదు. సంతోషంతో చేస్తే పుచ్చుకున్నవాడు కూడా ఆనందిస్తాడు. దానివల్ల మన పుణ్యం పెరుగుతుంది. అదే ధనానికి ఫలం.
వేద వేదాంగాలు చదివిన వారుంటారు. వారు నిత్యం సత్కర్మలే చేస్తూ లోకకళ్యాణం కోసం పాటుపడాలి. శాస్త్రాలు చదివిన వారందరూ అందులో చెప్పిన సదాచారాలను తాము ఆచరించి ఎదుటి వారికి బోధించాలి. ఆత్మబలం కనక ఉన్నట్లయితే ఎన్ని వివత్తులు మీదపడ్డా తట్టుకోగలం. అది లేని నాడు ఏ చిన్న కష్టం వచ్చినా క్రుంగిపోతాం.
ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము. క్రోధాన్ని శాంతంతో జయించాలి. దుష్టులను మంచి మాటలతో మరలించాలి. లోభబుద్ధి ఉంటే అది పోవడానికి దానగుణం అలవరచుకోవాలి. అసత్యాన్ని సత్యమే జయిస్తుంది. దొంగలు, జూదరులు, సోమరిపోతులు, కాముకులు, కృతఘ్నులు, నాస్తికులు వీరందరూ అపఖ్యాతినే పొందుతారు.
విద్యావంతుడు కానివాడి జీవితం నిరర్థకం. అలానే సంతానం లేని దాంపత్య జీవితమూనూ. విశ్రాంతి లేకుండా తిరిగే వారికి త్వరగా ముసలితనం వస్తుంది. వదిమంది చేత అవమానాల పాలయిన వాడి మనస్సుకి వార్ధక్యం ప్రాప్తిస్తుంది. నిరంతరం మననం చేసుకోక పోతే విద్య నిలవదు.
అన్నిటికంటె లోభం మహాచెడ్డది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే బంగారం, మణులూ, రత్నాలూ, ధాన్యాలూ, అన్నీ లభించినా యింకా ఏదో దొరకలేదని ఏడుస్తూనే ఉంటాడు లోభి. అందువల్లనే మానవుడు ముందుగా లోభ గుణాన్ని విడిచి పెట్టాలంటారు పెద్దలు.
నడ్డివంచి పని చేసేవాడికి ఏ లోటూ రాదు. సజ్జనులతో సహవాసం చేసే వానికి అపకీర్తి రాదు. వీరిద్దరూ సర్వ సుఖాలూ పొందుతారు. గుణవంతులను దోషులుగా ప్రచారం చెయ్యడం కంటె మరణం లేదు. ఇతరులను నిందిస్తూ కూర్చోవడం కంటె దరిద్రం లేదు.
విద్యార్థులయిన వారు సోమరితనాన్ని దరి చేరనివ్వకూడదు. వ్యామోహాలకు లొంగరాదు. మదోన్మత్తులు కాకూడదు. చపలచిత్తులు కాకూడదు. సర్వ సుఖభోగాలలో తేలియాడే వారికి చదువు రాదు. విద్యాభ్యాస కాలంలో వినయాన్నీ, క్లేశసహనాన్నీ అలవరచుకోవాలి. అప్పుడే విద్య అంటుతుంది.
ప్రభూ ! మరొక్క ముఖ్యమయిన మాట. సావధానంగా వినండి. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ మాత్రమే నిత్యం. అందుచేత దానిని గురించే యోచన చెయ్యాలి. ధన ధాన్య సమృద్ధమూ, రత్నమాణిక్య సంపన్నమూ అయిన ఈ భూమండలం అంతటినీ పాలించిన మహారాజు కూడా మరణానంతరం తనతో ఒక్క గడ్డి పరక కూడా పట్టుకుపోలేడు అన్నీ యిక్కడ విడిచి పోవలసిందే.
ఈ విషయం మీకు తెలియనిదని చెప్పడం లేదు. తెలిసిన వాటిని మళ్లీ గుర్తు చేసుకోవడం మన విధి. కష్టపడి పెంచి, పోషించి, విద్యాబుద్ధులు నేర్పి, సంపదలన్నీ యిచ్చిన తండ్రి మరణిస్తే, యిన్నీ అనుభవించే ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంతసేపు ఏడ్చి, వల్లకాటికి తీసుకుపోయి బూడిద చేస్తున్నాడు. అంతేగదా ! ఆ తరువాత హాయిగా జీవితం సాగిస్తున్నాడు. ఇది లోక వ్యవహారం.
ఆ మరణించిన వాడి సిరి సంపదలన్నీ బంధువులు పంచుకు తింటున్నారు. ఆ శరీరాన్ని బూడిద చేస్తే పంచ భూతాలలో కలసిపోతుంది. పాతిపెడితే నక్కలూ, గ్రద్దలూ తింటున్నాయి.
పువ్వులూ, కాయలూ లేని చెట్లమీదికి పక్షులు కూడా చేరవు. అలానే మరణించిన వాడితో ఎవరూ పోరు. వాడు చేసిన పుణ్య, పాపకర్మల ఫలం మాత్రం తనతో కూడా వెలుతుంది. కనుకనే దాన ధర్మాలూ, పుణ్యకార్యాలూ చెయ్యాలని పెద్దలు చెబుతున్నారు.
మనం చెయ్యవలసిన పనులు మనం చేసుకుంటూ పేదసాదలను ఆదరంతో చూస్తుండాలి. పుణ్యాత్ములను రక్షించడానికి ప్రయత్నించాలి. గురువుల యందు భక్తి కలిగి శ్రద్ధతో వారి బోధలు వింటూ, వారిని సేవించుకోవాలి. ఎప్పుడూ సత్యమే పలకాలి అసత్య భాషణానికి అవకాశం యివ్వకూడదు.
ధనవంతులు దానధర్మాలతో త్యాగబుద్ధిని ఎలా అలవర్చుకుంటారో, అలానే బలపరాక్రమాలు కలవారు ఎదుటి వారిని హింసించడానికి దానిని వినియోగించరాదు. దుర్బలులకు సాయపడడానికే వీరులు కృషి చెయ్యాలి. అన్ని దానాల కంటె శ్రేష్ఠమయినది అన్నదానం. అదే కదా ప్రాణానికి ఆధారం. అలానే జీవితంలో ప్రధాన మయినది ధర్మ మార్గాన నడవడం. అంతకంటె ఏమీలేదు.